ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో నేడు (ఫిబ్రవరి 6, 2026) కోటి తులసి పత్రి పూజ అత్యంత ఘనంగా ప్రారంభమైంది. లోకకల్యాణం, పాడిపంటల సమృద్ధిని కాంక్షిస్తూ ఆలయ వైదిక కమిటీ ఆధ్వర్యంలో ఈ విశిష్ట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు ఉదయం గణపతి పూజ, పుణ్యహావచనం, కలశస్థాపనతో 60 మంది ఋత్వికులు ఈ పూజను ప్రారంభించారు. నేటి నుండి ఫిబ్రవరి 15 (మాఘ బహుళ త్రయోదశి) వరకు ప్రతి రోజూ ఉదయం 8:00 నుండి 11:30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:00 నుండి 5:30 వరకు పూజలు జరుగుతాయి.
ఫిబ్రవరి 15న ఉదయం 8 గంటలకు రుద్రహోమంతో ఈ పూజలు ముగుస్తాయి. పూజా కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజూ లింగార్చన, సూర్యనమస్కారాలు, వేదపారాయణలు మరియు రాత్రి 7 గంటలకు మహా నివేదన, నీరాజన మంత్రపుష్పాలు నిర్వహించబడతాయి.సత్యదేవుని సన్నిధిలో జరుగుతున్న ఈ మహోత్తర కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అధికారులు కోరారు.
