రాజకీయాల్లో ఎంత ఎత్తుకు ఎదిగినా పెద్దలను గౌరవించడంలో తాను ఎప్పుడూ ముందే ఉంటానని మంత్రి నారా లోకేష్ మరోసారి నిరూపించుకున్నారు. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నేత గౌతు శ్యాంసుందర్ శివాజీతో లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

లోకేష్ గారి ఆహ్వానం మేరకు విచ్చేసిన శివాజీ గారికి మంత్రి స్వయంగా ఎదురేగి స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ కలిసి భోజనం చేస్తూ ఆత్మీయంగా ముచ్చటించారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న శివాజీ గారి నుంచి నైతిక విలువలు, పార్టీ బలోపేతం మరియు నాడు ఆయన నిర్వహించిన మంత్రిత్వ శాఖల పనితీరు గురించి లోకేష్ అడిగి తెలుసుకున్నారు.సీనియర్ల అనుభవాన్ని గౌరవిస్తూ, తెలియని విషయాలను నేర్చుకోవడంలో తాను ఎప్పుడూ నిత్య విద్యార్థినేనని లోకేష్ ఈ భేటీ ద్వారా చాటిచెప్పారు. స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న వారసత్వాన్ని, శివాజీ గారి రాజకీయ నిబద్ధతను లోకేష్ కొనియాడారు.ఈ ఆత్మీయ భేటీలో అలనాటి రాజకీయ ముచ్చట్లను శివాజీ గారు వివరించగా, లోకేష్ ఎంతో ఆసక్తిగా విన్నారు.
