కర్నూలు: కర్నూలు జిల్లా ఆదోనిలో 15 ఏళ్ల బాలుడు వీరేంద్ర హత్య కేసు సంచలనం రేపింది. తల్లి గంగమ్మ తన ప్రియుడు దర్గప్పతో కలిసి కుమారుడిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
తల్లి అక్రమ సంబంధాన్ని వీరేంద్ర తరచూ ప్రశ్నించడంతో పాటు బంధువులు, గ్రామస్థుల ముందు బయటపెట్టాడు. దీంతో అడ్డంకిగా భావించిన ఇద్దరూ అతడిని హత్య చేసి గ్రామ శివారులోని శ్మశానంలో రహస్యంగా పూడ్చిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.
అనుమానం రాకుండా గంగమ్మ తన కుమారుడు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. అతడి కోసం వెతికినట్లు నటించడమే కాకుండా, దర్యాప్తు ఆలస్యమైందంటూ హైకోర్టును కూడా ఆశ్రయించింది.
హైకోర్టు ఆదేశాలతో ఏర్పాటు చేసిన ఎస్ఐటీ దర్యాప్తులో గంగమ్మ, దర్గప్ప వాంగ్మూలాల్లో విరుద్ధతలు బయటపడ్డాయి. కాల్ రికార్డులు, సాంకేతిక ఆధారాలు, స్థానికుల వాంగ్మూలాలతో ఇద్దరిపై అనుమానం బలపడింది.
నిందితులను విచారించిన పోలీసులు జూన్ 1న శ్మశానంలో పూడ్చిపెట్టిన వీరేంద్ర మృతదేహాన్ని వెలికితీశారు. దర్గప్పను అదుపులోకి తీసుకుని మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు.

