అనకాపల్లిలో బంగ్లాదేశ్‌ విద్యార్థినిపై అత్యాచారయత్నం.. స్పాట్‌లో నిందితుడు మృతి

September 7, 2026 11:13 AM

భవనం పిల్లరు పట్టుకుని తప్పించుకునే క్రమంలో ప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌కు చెందిన ఓ విద్యార్థినిపై అత్యాచారానికి యత్నించిన నిందితుడు.. భయం కారణంగా అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అచ్యుతాపురంలో జరిగింది.

కాకినాడలో బీఫార్మసీ చదువుతున్న విద్యార్థిని

సీఐ చంద్రశేఖరరావు, ఎస్సై సుధాకరరావు ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్‌కు చెందిన యువతి కాకినాడలో బీఫార్మసీ అభ్యసిస్తోంది.

కళాశాలలో ఆమెకు ఓ సీనియర్ విద్యార్థితో పరిచయం ఏర్పడింది. ఆ యువకుడు అచ్యుతాపురంలో నివాసం ఉంటూ అక్కడి సెజ్‌లోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

ఈ క్రమంలో పది రోజుల క్రితం అచ్యుతాపురం వచ్చిన విద్యార్థిని.. తన స్నేహితుడైన ఆ సీనియర్ విద్యార్థి గదిలోనే ఉంటోంది.

గదిలో ఒంటరిగా ఉండటాన్ని గమనించి..

స్థానికంగా ఉన్న ఓ మద్యం దుకాణంలో ఝార్ఖండ్‌కు చెందిన కమలేష్‌యాదవ్ (43) పనిచేస్తున్నాడు.

అతను అదే ప్రాంతంలోని వెదురువాడలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనంలో అద్దెకు ఉంటున్నాడు.

యువతి ఉంటున్న గదికి సమీపంలోనే అతని గది ఉంది.

శనివారం మధ్యాహ్నం యువతి గదిలో ఒంటరిగా ఉండటాన్ని కమలేష్‌యాదవ్ గమనించాడు.

ఆమె స్నేహితుడు విధులకు వెళ్లిన సమయంలో ఎవరూ లేరని భావించి గది వద్దకు వెళ్లాడు.

మరుగుదొడ్డిని శుభ్రం చేయాలని ఓ వ్యక్తి చెప్పాడంటూ యువతిని నమ్మించే ప్రయత్నం చేశాడు.

కొద్దిసేపు మరుగుదొడ్డిని శుభ్రం చేస్తున్నట్లు నటించిన కమలేష్‌యాదవ్.. ఆ తర్వాత విద్యార్థినిపై అత్యాచారానికి యత్నించినట్లు పోలీసులు తెలిపారు.

దీంతో అప్రమత్తమైన యువతి అతడిని తీవ్రంగా ప్రతిఘటించింది.

తప్పించుకుని స్థానికులకు విషయం చెప్పిన యువతి

నిందితుడి నుంచి తప్పించుకున్న యువతి పరుగున భవనం కిందకు వచ్చింది.

అక్కడ స్థానికులకు జరిగిన విషయాన్ని వివరించింది. స్థానికులు అప్రమత్తమయ్యేలోపే తన విషయం బయటపడుతుందనే భయంతో కమలేష్‌యాదవ్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు.

భవనం పైనుంచి కిందకు దిగేందుకు దారి లేకపోవడంతో పిల్లరు పట్టుకుని కిందకు దిగేందుకు ప్రయత్నించాడు.

ఈ క్రమంలో ఒక్కసారిగా అతని పట్టుతప్పింది. దీంతో ప్రమాదవశాత్తు భవనం పైనుంచి నేలపై పడిపోయాడు.

తీవ్ర గాయాలతో కమలేష్‌యాదవ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

కేసు నమోదు చేసి దర్యాప్తు

సమాచారం అందుకున్న అచ్యుతాపురం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

పరిస్థితిని సమీక్షించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media