బట్టల షాపులో చోరీ చేసి ఆటోలో పారిపోతున్న దొంగల ముఠా కథ అడ్డరోడ్డులో ముగిసింది. అద్దంకి పట్టణంలోని వైష్ణవి క్లోత్ షోరూమ్ నందు బట్టల సంచులతో ఉడాయించిన దొంగలు, పారిపోయే క్రమంలో ప్రమాదానికి గురై ఒకరు స్థానికులకు దొరికిపోయారు.
పట్టణంలోని వైష్ణవి బట్టల షాపులో ఐదుగురు సభ్యుల ముఠా చొరబడి భారీగా బట్టలను దొంగిలించి ఆటోలో పారిపోయే ప్రయత్నం చేశారు.దర్శి రోడ్డులో వేగంగా వెళ్తున్న వీరి ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న నూడుల్స్ బండిని బలంగా ఢీకొట్టింది. ఆటో బోల్తా పడటంతో అందులో ఉన్న నలుగురు దొంగలు చీకట్లోకి పరారవ్వగా, ఒక దొంగ మాత్రం స్థానికులకు చిక్కాడు. కోపోద్రిక్తులైన స్థానికులు దొంగను పట్టుకొని దేహశుద్ధి చేశారు. నిందితుడి వద్ద వైష్ణవి షాపు నుంచి దొంగిలించిన బట్టల సంచులను షాపు యజమాని గుర్తించారు.సమాచారం అందుకున్న అద్దంకి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పరారైన మిగిలిన నలుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
