దేశ భద్రతలో సముద్ర తీరాల రక్షణ అత్యంత కీలకమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకరరావు పేర్కొన్నారు. సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘వందేమాతరం కోస్టల్ సైక్లథాన్-2026’ బృందం గురువారం కళింగపట్నం చేరుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

6,553 కిలోమీటర్ల మేర సాగుతున్న ఈ యాత్రలో 130 మంది జవాన్లు పాల్గొంటున్నారు. ఇందులో సగం మంది (65 మంది) మహిళా సిబ్బంది ఉండటం విశేషం. యువతకు శుభవార్త చెబుతూ.. ఈ ఏడాది సీఐఎస్ఎఫ్లో మరో 15,000 ఖాళీల భర్తీ జరగనుందని కమాండెంట్ జితేంద్రబాబు వెల్లడించారు. ఈ అవకాశాన్ని యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్లో ప్రారంభమైన ఈ యాత్ర 9 రాష్ట్రాల మీదుగా 52 తీర ప్రాంత గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ ఈ నెల 22న కేరళలోని కొచ్చిలో ముగియనుంది. బుద్ధా స్కూల్ వద్ద నిర్వహించిన సాక్సోఫోన్ ప్రదర్శన, కోలాటం, నృత్యాలు పర్యాటకులను, విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తీర ప్రాంత ప్రజలు దేశభక్తితో భద్రతా దళాలకు సహకరించాలని, ఓడరేవుల రక్షణలో భాగస్వాములు కావాలని అధికారులు ఆకాంక్షించారు.

