పాపికొండల విహార యాత్రకు ప్రసిద్ధి చెందిన పోచవరం బోటింగ్ పాయింట్ వద్ద శనివారం మొసలి ప్రత్యక్షమవ్వడం కలకలం రేపింది. గోదావరి నది ఒడ్డున ఒక పెద్ద మొసలి సేద తీరుతుండటాన్ని పర్యాటకులు గుర్తించి ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
పాపికొండల యాత్ర కోసం బోట్ల వద్దకు చేరుకున్న పర్యాటకులు, నది ఒడ్డున మొసలిని చూసి కేకలు వేశారు. దీంతో అక్కడ పర్యాటకుల రద్దీ పెరిగింది. అటవీ శాఖ అధికారుల రాక కోసం వేచి చూడకుండా, స్థానికులు ధైర్యంతో ముందుకు వచ్చి మొసలిని తాళ్లతో బంధించారు. అనంతరం ఆ మొసలిని సురక్షితంగా గోదావరి నది మధ్యలోకి తీసుకెళ్లి విడిచిపెట్టారు.మొసలి సంచారం దృష్ట్యా పర్యాటకులు, స్థానికులు ఎవరూ గోదావరి నదిలోకి దిగవద్దని, నది ఒడ్డున తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.ప్రస్తుతానికి మొసలిని నదిలోకి విడిచిపెట్టడంతో పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే బోటింగ్ పాయింట్ వద్ద భద్రతను పర్యవేక్షించాలని సందర్శకులు కోరుతున్నారు.
