ప్రకాశం జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైల్వే వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
లోడ్ తో వెళ్తున్న గూడ్స్ రైలు అమ్మనబ్రోలు వద్దకు రాగానే ఒక్కసారిగా పట్టాలు తప్పింది. ప్రమాద ధాటికి గూడ్స్ బోగీలు రెండు రైల్వే లైన్లపై అడ్డంగా పడిపోయాయి. ప్రధాన లైన్లపై బోగీలు పడిపోవడంతో విజయవాడ – చెన్నై మార్గంలో నడిచే పలు ఎక్స్ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

రైల్వే అధికారులు అప్రమత్తమై సమీప స్టేషన్లలోనే రైళ్లను నిలిపివేశారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రైల్వే ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది భారీ క్రేన్లతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పట్టాలపై పడిన బోగీలను తొలగించి, ట్రాక్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేశారు.గూడ్స్ రైలు కావడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, పట్టాలు మరియు సిగ్నలింగ్ వ్యవస్థ పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.మరమ్మత్తు పనులు పూర్తి కావడానికి మరికొన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉందని, అప్పటి వరకు ఈ మార్గంలో రైళ్ల రాకపోకల్లో జాప్యం ఉంటుందని అధికారులు వెల్లడించారు.
