ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చాటిచెప్పేలా నేలపాడు వేదికగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సోమవారం జరిగిన ఈ ఉత్సవాల్లో రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు.

ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వేదికపై మంత్రి నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పరస్పరం ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్, ఏపీఎస్పీ బెటాలియన్లతో పాటు కేరళ రాష్ట్ర పోలీస్ విభాగం ఈ కవాతులో పాల్గొన్నాయి. ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ మొదటి స్థానంలో నిలవగా, విశాఖపట్నం ఏపీఎస్పీ 16వ బెటాలియన్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. రాజ్యాంగ విలువలను కాపాడాలని, రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గవర్నర్ పిలుపునిచ్చారు. ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల విన్యాసాలు, బ్రాస్ బ్యాండ్ ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి.రాజధాని నేలపాడులో నిర్వహించిన ఈ వేడుకలు అమరావతి ప్రాశస్త్యాన్ని మరోసారి చాటిచెప్పాయి.

