వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడనం ప్రభావం
AP Telangana Weather Update: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ వ్యవస్థ ఉత్తర ఒడిశా, గంగా తీర పశ్చిమ బెంగాల్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది.
రుతుపవన ద్రోణి అల్పపీడన ప్రాంత కేంద్రం గుండా కొనసాగుతూ.. అక్కడి నుంచి ఆగ్నేయంగా తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు వెళ్తోంది. వీటి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణలో వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్-మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, జనగామ, మహబూబ్నగర్, కరీంనగర్, కామారెడ్డి, హనుమకొండ జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆయా ప్రాంతాల్లో 5 మి.మీ. లోపు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
ఏపీలోనూ వర్షసూచన
ఆంధ్రప్రదేశ్లో ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అదే సమయంలో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.



