మధుర వాడ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవీ మాత ఆత్మగౌరవం కోసం అగ్ని ప్రవేశం చేసిన ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు.
ఉదయాన్నే అమ్మవారిని వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అగ్ని హోమం, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక కుంకుమ పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమం అనంతరం వేద పండితులు భక్తులకు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, ఆలయ ధర్మకర్తల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో మధురవాడ పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
