బెదిరింపులు, వీడియోలు తీసి డబ్బుల డిమాండ్..
ఎనిమిది మంది అరెస్ట్..
హైదరాబాద్: Arunachalam, తమిళనాడులోని తిరువణ్ణామలై గిరి ప్రదక్షిణ మార్గంలో వరుసగా రెండు దారుణ ఘటనలు వెలుగుచూశాయి. ఇద్దరు యువతులపై వేర్వేరు సందర్భాల్లో ఒకే ముఠా సామూహిక అత్యాచారాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుల్లో ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్టు చేయగా, మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది.
మొదటి ఘటనలో ధర్మపురికి చెందిన ఓ వివాహిత గత నెల 30న స్నేహితులతో కలిసి పౌర్ణమి గిరి ప్రదక్షిణకు వచ్చింది. ప్రదక్షిణ పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా పెద్దకోలాపాడి సమీపంలో ముఠా వారిని అడ్డగించింది. మారణాయుధాలతో బెదిరించి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడింది.
అనంతరం బాధితులను నగ్నంగా వీడియో తీసి, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తూ రూ.లక్ష డిమాండ్ చేసింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు మొదలైంది.
Arunachalam లో మరో రోజు మరో దాడి
మరో ఘటనలో తిరువణ్ణామలైకి చెందిన 23 ఏళ్ల యువతి గత నెల 31న గిరి ప్రదక్షిణ చేస్తుండగా స్నేహితుడితో కలిసి అయ్యంపాలయం బైపాస్ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ ముఠా వారిని బెదిరించి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి యువతిపై సామూహిక అత్యాచారం చేసింది. ఇద్దరినీ నగ్నంగా వీడియో తీసి, యువతి బంగారు కమ్మలు లాక్కుంది.
ఐదు బృందాలతో దర్యాప్తు
ఈ రెండు ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. మొత్తం 11 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించి, మంగళవారం రాత్రి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనలు తిరువణ్ణామలై గిరి ప్రదక్షిణ భద్రతపై తీవ్ర ఆందోళనకు దారితీశాయి.

