రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిప్పులు చెరిగారు. శనివారం కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని ఓడించి కేవీఆర్ గెలవడాన్ని కాంగ్రెస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని, అందుకే దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసిన కాంగ్రెస్ వారిని వదిలేసి, బీజేపీ నేతలను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. బాన్సువాడ, నాగర్ కర్నూల్ దాడులకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పరామర్శకు వస్తున్న బీజేపీ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, సీఎం రేవంత్ రెడ్డి హోం శాఖను పరోక్షంగా ఓవైసీ సోదరులకు అప్పగించారని విమర్శించారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, హామీలు అమలు చేయలేని కాంగ్రెస్కు అధికారంలో ఉండే అర్హత లేదని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
