సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు) 10వ జిల్లా మహాసభలు కడపలోని పాత రిమ్స్ ప్రాంగణంలో విజయవంతంగా ముగిశాయి. ఈ మహాసభలకు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు అధ్యక్షత వహించారు.
మహాసభ ప్రారంభంలో జిల్లా అధ్యక్షుడు కే. శ్రీనివాసులరెడ్డి జెండా ఆవిష్కరించగా, అనంతరం అధ్యక్ష వర్గం ఆధ్వర్యంలో సమావేశం కొనసాగింది. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబుల్ గత మూడు సంవత్సరాల పోరాటాలను సమీక్షిస్తూ, భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి సారించాలని సూచించారు.జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ నివేదికను ప్రవేశపెట్టారు. ముగింపు సమావేశంలో సిహెచ్ నరసింహరావు మాట్లాడుతూ కడప జిల్లాలో సిఐటియు రాజీలేని పోరాటాలు నిర్వహించిందని తెలిపారు. కార్మికులకు తగిన వేతనాలు ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, కార్మిక సమస్యలపై నిరంకుశ వైఖరి ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు.అలాగే నంద్యాలలో ఏప్రిల్ 17, 18, 19 తేదీల్లో జరిగే 17వ రాష్ట్ర మహాసభలకు కడప జిల్లా నుంచి భారీగా కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
