గోదావరి పుష్కరాల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారిగా అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు జరగనున్న ఈ మహా క్రతువును చారిత్రాత్మకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రిగా తన హయాంలో మూడవసారి గోదావరి పుష్కరాలు నిర్వహించడం తన అదృష్టమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సమీక్షకు ముందు వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందజేశారు.ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లకు అదనంగా 139 కొత్త ఘాట్లను నిర్మించాలని నిర్ణయించారు. మొత్తం 373 ఘాట్లను 9,918 మీటర్ల పొడవున అభివృద్ధి చేయనున్నారు.ఈ పుష్కరాలకు దేశ విదేశాల నుండి సుమారు 10 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా ఆరు జిల్లాల్లో (పోలవరం, ఏలూరు, తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ) పటిష్ట ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు.
పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఈ సమీక్షలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, అనిత, నారాయణ, నిమ్మల రామానాయుడు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
