ప్రెస్–పోలీస్ స్నేహానికి క్రికెట్ వేదిక
ఛాంపియన్గా పోలీస్ హంటర్స్.. అద్వైత్ ఆల్రౌండ్ మెరుపు
హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026 విజయవంతంగా ముగిసింది. పోలీసు సిబ్బంది, మీడియా ప్రతినిధుల మధ్య స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ టోర్నమెంట్ నిర్వహించారు. మూడు రోజుల పాటు ఉత్సాహంగా సాగిన పోటీలకు ఆదివారం తెరపడింది.
ఫైనల్లో పోలీస్ హంటర్స్ ఆధిపత్యం
టోర్నమెంట్లో భాగంగా జరిగిన ఫైనల్ మ్యాచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పోలీస్ హంటర్స్ జట్టు ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేసింది.
నిర్ణీత ఓవర్లలో 224 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
జట్టు తరఫున అద్వైత్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ఆరంభం నుంచే దూకుడుగా బ్యాటింగ్ చేశారు. బౌండరీలు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
ఆయన 92 పరుగులు చేసి జట్టు భారీ స్కోరుకు బలమైన పునాది వేశారు.
73 పరుగులకే కుప్పకూలిన క్రైమ్ వారియర్స్
225 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన క్రైమ్ వారియర్స్ జట్టు ఆరంభం నుంచే ఒత్తిడిలో పడింది. పోలీస్ హంటర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ప్రత్యర్థి బ్యాటర్లకు అవకాశమే ఇవ్వలేదు.
వికెట్లు వరుసగా కోల్పోయిన క్రైమ్ వారియర్స్ జట్టు 73 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో పోలీస్ హంటర్స్ జట్టు భారీ తేడాతో విజయం సాధించింది. టోర్నమెంట్ ఛాంపియన్గా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది.
అద్వైత్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
ఫైనల్ మ్యాచ్లో అద్వైత్ ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చారు. బ్యాటింగ్లో 92 పరుగులు సాధించారు. బౌలింగ్లో రెండు కీలక వికెట్లు తీశారు.
మ్యాచ్ ఫలితాన్ని మలిచిన ఈ ప్రదర్శనకు గాను ఆయనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఫైనల్లో ఆయన ఆట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నరేష్కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్
టోర్నమెంట్ మొత్తం స్థిరమైన ప్రదర్శన చేసిన పోలీస్ హంటర్స్ ఆటగాడు నరేష్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నారు.
పోటీల్లో ఆయన మొత్తం 180 పరుగులు చేశారు. పలుమ్యాచ్లలో జట్టుకు కీలక ఇన్నింగ్స్ ఆడారు. జట్టు విజయాల్లో ముఖ్య పాత్ర పోషించారు. ఈ ప్రదర్శనకు గుర్తింపుగా నిర్వాహకులు ఆయనను సత్కరించారు.
విజేతలకు ట్రోఫీలు అందజేసిన సీపీ
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, ఐపీఎస్ విజేతలకు ట్రోఫీలు, వ్యక్తిగత అవార్డులు అందజేశారు. ఆటగాళ్లను అభినందించారు. క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొన్న అన్ని జట్లను ప్రశంసించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖ ఉద్యోగం అయినా, మీడియా రంగం ఉద్యోగం అయినా నిరంతర ఒత్తిడితో కూడుకున్నవేనన్నారు. రాత్రింబవళ్లు విధులు నిర్వర్తించాల్సి వస్తుందని చెప్పారు.
అలాంటి పరిస్థితుల్లో పనిచేస్తున్న రెండు వర్గాల మధ్య పరస్పర అవగాహన పెరగాలని, స్నేహపూర్వక వాతావరణం మరింత బలపడాలని ఈ లీగ్ను నిర్వహించామని తెలిపారు.
10 జట్లతో విజయవంతంగా నిర్వహణ
సైబరాబాద్ పరేడ్ గ్రౌండ్లో 10 జట్లతో మూడు రోజుల పాటు ఈ టోర్నమెంట్ నిర్వహించారు. పోటీలు విజయవంతం కావడానికి కృషి చేసిన అధికారులు, నిర్వాహకులు, సిబ్బంది,
మీడియా ప్రతినిధులు, సహకరించిన ప్రతి ఒక్కరికి సీపీ కృతజ్ఞతలు తెలిపారు.
మీడియా ప్రతినిధుల అభ్యర్థన మేరకే ఈ క్రికెట్ లీగ్ను నిర్వహించామని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని వెల్లడించారు.
క్రికెట్తో పాటు బ్యాడ్మింటన్ వంటి ఇతర క్రీడా పోటీలను కూడా నిర్వహించే ఆలోచన ఉందన్నారు. పోలీసు–మీడియా సంబంధాలను మరింత బలోపేతం చేసే వేదికలుగా
ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
పలువురు ఉన్నతాధికారుల హాజరు
ఈ కార్యక్రమంలో సీపీ డా. ఎం. రమేష్తో పాటు అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణ, శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్, ఎస్బీ డీసీపీ సుధీంద్ర, హెడ్ క్వార్టర్ డీసీపీ సంజీవ్, సైబర్ క్రైమ్స్ డీసీపీ సాయి మనోహర్,
శేరిలింగంపల్లి ట్రాఫిక్ ఏడీసీపీ హనుమంతరావు, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీలు హనుమంతరావు, షమీర్, ఆర్ఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Also read


