కులాలు, ప్రాంతాలు, వర్గాలకు ప్రాధాన్యం
బెంగళూరు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజకీయ వర్గాల్లో ఒక ప్రధాన చర్చ మొదలైంది.
కుల ప్రాతినిధ్యం, పరిపాలనా అనుభవం, పార్టీ అంతర్గత శక్తి సమీకరణాల మధ్య కాంగ్రెస్ సరైన సమతుల్యత సాధించిందా అనే ప్రశ్న ముందుకు వచ్చింది.
కొత్త ప్రభుత్వ నాయకత్వ బృందాన్ని పరిశీలిస్తే కాంగ్రెస్ మూడు అంశాలపైనా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావం చూపే సామాజిక వర్గాలకు చోటు కల్పించడంతో పాటు అనుభవజ్ఞులైన నేతలకు అవకాశం ఇచ్చింది.
అదే సమయంలో పార్టీ లోపలి వర్గాలకు కూడా తగిన ప్రాధాన్యం కల్పిస్తూ ఒకే వర్గం ఆధిపత్యం చెలాయించకుండా జాగ్రత్త పడింది.
ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రెవెన్యూ మంత్రి కృష్ణ బైరెగౌడల ద్వారా వొక్కలిగ సమాజానికి ప్రాతినిధ్యం లభించింది.
పాత మైసూరు ప్రాంత రాజకీయాల్లో ఈ వర్గం ఇప్పటికీ కీలక ప్రభావం కలిగి ఉంది.
ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ పరమేశ్వర, కేహెచ్ మునియప్ప, ప్రియాంక్ ఖర్గేలతో షెడ్యూల్డ్ కులాల వర్గానికి బలమైన ప్రాతినిధ్యం దక్కింది. రాష్ట్రంలోని అతిపెద్ద సామాజిక వర్గాల్లో ఇది ఒకటి కావడం గమనార్హం.
లింగాయతులకు ప్రాధాన్యం.. సిద్ధరామయ్య వర్గానికీ చోటు
ఉత్తర, మధ్య కర్ణాటక రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా భావించే లింగాయత వర్గానికి ఎంబీ పాటిల్, ఈశ్వర్ ఖండ్రే, శరణ ప్రకాశ్ పాటిల్ ద్వారా కీలక ప్రాతినిధ్యం లభించింది.
సంప్రదాయంగా బీజేపీకి మద్దతుగా భావించే ఈ వర్గంలో కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకోవాలనే వ్యూహంలో ఈ నిర్ణయం కీలకంగా కనిపిస్తోంది.
మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సన్నిహితంగా భావించే కురుబ వర్గానికి యతీంద్ర సిద్ధరామయ్య, బైరతి సురేష్ ద్వారా స్థానం లభించింది.
దీంతో సిద్ధరామయ్య వర్గం మద్దతుదారులకు భరోసా కలిగించే ప్రయత్నం చేసినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
అల్పసంఖ్యాక వర్గాలకు కూడా కాంగ్రెస్ ప్రాధాన్యం ఇచ్చింది. యూటీ ఖాదర్ ముస్లిం వర్గానికి, కేజే జార్జ్ క్రైస్తవ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
రామలింగారెడ్డి ద్వారా రెడ్డి సామాజిక వర్గానికి చోటు దక్కగా, సతీశ్ జార్కిహొళి ద్వారా వెనుకబడిన వర్గాల స్వరం ప్రభుత్వంలో ప్రతిబింబించే అవకాశం కలిగింది.
బెలగావి ప్రాంతానికి చెందిన ఆయన ప్రాంతీయంగా కూడా బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు.
అనుభవం ఉన్న నేతలకు కీలక బాధ్యతలు
కుల సమీకరణాలతో పాటు పరిపాలనా అనుభవాన్ని కూడా కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకుంది. ఎంబీ పాటిల్, రామలింగారెడ్డి, కేజే జార్జ్, కేహెచ్ మునియప్ప, పరమేశ్వర, ప్రియాంక్ ఖర్గే గత ప్రభుత్వాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు.
దీంతో కొత్త ప్రభుత్వానికి రాజకీయ అనుభవం, పరిపాలనా సామర్థ్యం రెండూ లభించాయి.పార్టీ అంతర్గత సమతుల్యత కూడా కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది.
డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఎంపిక కావడం ఆయన వర్గానికి పెద్ద విజయంగా భావిస్తున్నప్పటికీ, సిద్ధరామయ్యకు సన్నిహితంగా ఉన్న నేతలకు కూడా స్థానం కల్పించడం ద్వారా సమతుల్యత పాటించే ప్రయత్నం చేసింది.
ఈ సామాజిక, రాజకీయ సమీకరణాలు పరిపాలనలో ఎంతవరకు ఫలితాలు ఇస్తాయో చూడాల్సి ఉంది. అయితే తొలి కేబినెట్ కూర్పు కాంగ్రెస్ వ్యూహాత్మక ఆలోచనలను స్పష్టంగా చూపిస్తోంది.
మహిళలకు చోటు లేకపోవడంపై విమర్శలు
అయితే కొత్త నాయకత్వ బృందంలో ఒక ముఖ్యమైన లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రితో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో ఒక్క మహిళకూ చోటు దక్కలేదు.
మహిళా సాధికారత గురించి తరచూ మాట్లాడే కాంగ్రెస్ తొలి కేబినెట్లో మహిళలకు అవకాశం ఇవ్వకపోవడం విమర్శలకు దారితీసింది.
సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ గవర్నర్ మార్గరెట్ ఆల్వా కూడా దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం ఒక మహిళా మంత్రికైనా అవకాశం కల్పించి ఉంటే బాగుండేదని ఆమె పేర్కొన్నారు.
“డీకే శివకుమార్కు అభినందనలు. ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన బృందం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. కొత్త కేబినెట్లో కనీసం ఒక్క మహిళా కాంగ్రెస్ నేత అయినా ఉంటే సంతోషించేదాన్ని. అది లేకపోవడం నిరాశ కలిగించింది” అని ఆల్వా ఎక్స్లో పోస్టు చేశారు.
ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్కు లక్ష్మీ హెబ్బాళ్కర్, రూపకళ శశిధర్, నయన మోటమ్మ, కనీజ్ ఫాతిమా రూపంలో నలుగురు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు.
శాసన మండలిలో గాయత్రి శాంతేగౌడ, పుష్పా అమర్నాథ్, బిల్కిస్ బానో, డాక్టర్ ఆరతి కృష్ణ, ఉమాశ్రీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినప్పటికీ తొలి కేబినెట్లో ఎవరికీ అవకాశం రాలేదు.
డీకే శివకుమార్ ఇంకా 21 మంత్రి పదవులను భర్తీ చేయాల్సి ఉంది. మొత్తం 34 మంది మంత్రులను నియమించే అవకాశం ఉంది. తదుపరి విడతలో మహిళలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also read



