బీజేపీలోనే కొనసాగుతా:ఎంపీ ఈటల రాజేందర్

April 5, 2026 10:53 PM


మేడ్చల్ :తనపై పార్టీ మార్పు జరుగుతోందనే ప్రచారాలు పూర్తిగా అబద్ధమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఐదేళ్ల క్రితం బీఆర్ఎస్ నుంచి తనను బహిష్కరించారని, ఆ తర్వాత బీజేపీలో చేరినట్లు గుర్తు చేశారు. పార్టీలు మారడం బట్టలు మార్చినంత ఈజీ కాదని, తాను ఎప్పుడూ పార్టీ మార్పులను ప్రోత్సహించలేదని తెలిపారు.తెలంగాణ సమాజానికి తన గురించి పూర్తిగా అవగాహన ఉందని, ఇలాంటి ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్‌లో తనకు అభిమానులు, పరిచయస్తులు ఎక్కువగా ఉన్నప్పటికీ, తిరిగి ఆ పార్టీతో కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనను బర్తరఫ్ చేయడమే కాకుండా కోళ్ల ఫార్ములు కూల్చడం, భూములను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలు జరిగాయని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేస్తూ అబద్ధాల పునాదుల మీదే ఆయన గెలిచారని, అదే విధంగా పాలన కొనసాగుతోందన్నారు. ప్రభుత్వం మీడియాను మేనేజ్ చేస్తూ దబాయింపు రాజకీయాలు చేస్తున్నదని ఆరోపించారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సర్వేలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇస్తామని, “నా వాడు కాదు” అనే భావనతో టికెట్లు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఆరుగురు ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమాలు చేపట్టబోతున్నామని వెల్లడించారు. మొదటి కార్యక్రమంగా ‘చలో బాలాజీ నగర్’ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.
పార్లమెంట్ పరిధి సమస్యలు, సిఎస్ఆర్ నిధులపై ప్రధానికి లేఖ రాసినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరగదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.హుజూరాబాద్ డంపింగ్ యార్డ్ సమస్యపై ప్రజలు పిలిస్తే ముందుండి పోరాటం చేస్తానన్నారు. భూముల ఆక్రమణలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కోర్టులపై కూడా ప్రభావం చూపే స్థాయికి పరిస్థితులు వెళ్లాయని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media