కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన దుబారే ఎలిఫెంట్ క్యాంప్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రెండు ఏనుగులు గొడవ పడుతున్న సమయంలో జరిగిన ప్రమాదంలో చెన్నైకి చెందిన ఓ మహిళా పర్యాటకురాలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కొడగు జిల్లాలో జరిగింది. దుబారే శిబిరంలోని ఏనుగులకు మావటీలు కొలనులో స్నానం చేయిస్తున్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా రెండు ఏనుగులు ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటూ తీవ్రంగా ఘర్షణకు దిగాయి. దీంతో అక్కడున్న పర్యాటకులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ క్రమంలో ఓ ఏనుగు అదుపుతప్పి పర్యాటకుల వైపు దూసుకొచ్చి, చెన్నైకి చెందిన మహిళపై పడిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. కర్ణాటకలోని దుబారే ఏనుగుల శిబిరంకు రోజూ వందల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.

