బంగారం కొనుగోళ్లపై బ్రేక్‌.. వెండి ధరలో స్వల్ప తగ్గుదల

June 1, 2026 10:24 AM

హైదరాబాద్: బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. గత కొంతకాలంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల విషయంలో ఎన్నడూ లేని స్థాయిలో అనిశ్చితి నెలకొంది. ఒకరోజు పెరుగుతూ, మరోరోజు తగ్గుతూ, కొన్ని సందర్భాల్లో స్థిరంగా ఉండటంతో కొనుగోలుదారులు అయోమయానికి గురవుతున్నారు.

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో ధరలు ఏ దిశగా వెళ్లనున్నాయో అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో బంగారం, వెండి ఆభరణాల కొనుగోళ్లకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో క్రూడాయిల్‌ ధరలు పెరుగుతున్నాయి. దాంతో ద్రవ్యోల్బణం కూడా పెరిగింది. నిత్యావసర వస్తువుల ధరలు భారమయ్యాయి. పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెరగడంతో ప్రజలు పొదుపు చర్యలపై దృష్టి పెట్టుతున్నారు. గతంలో పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి సందర్భాల్లో బంగారం కొనుగోలు చేసే వారు ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారు.

మరోవైపు పెట్టుబడిదారులు కూడా సందిగ్ధంలో ఉన్నారు. బంగారం, వెండిలో పెట్టుబడి ప్రస్తుతం సురక్షితంగా ఉండకపోవచ్చని భావిస్తూ చాలామంది దూరంగా ఉంటున్నారు.

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగాయి. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో నమోదైన ధరల ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,43,940గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,57,030గా నమోదైంది. కిలో వెండి ధర ₹2,89,900 వద్ద ట్రేడవుతోంది.

అయితే అంతర్జాతీయ మార్కెట్‌ పరిస్థితులను బట్టి మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media