ఇరాన్ వివాదం కారణంగా మధ్యప్రాచ్యంలోని అత్యంత వ్యూహాత్మకమైన ‘హార్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) మూసివేయబడినప్పటికీ, భారతదేశానికి చెందిన ముడి చమురు, ఎల్పీజీ (LPG) నౌకలు మాత్రం సురక్షితంగా ప్రయాణిస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో దేశానికి ఇంధన సరఫరా నిలిచిపోకుండా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహం సత్ఫలితాలను ఇస్తోంది.
ఇరాన్తో భారత్ జరిపిన నిరంతర దౌత్యపరమైన చర్చలే ఈ విజయానికి ప్రధాన కారణం. దీని ద్వారా ఇరాన్ తీరానికి సమీపంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన మార్గాల ద్వారా కూడా భారతీయ నౌకలకు సురక్షిత ప్రయాణం లభించింది. పెర్షియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధి ప్రాంతంలో భారత నౌకాదళం తన నిఘాను తీవ్రతరం చేసింది. ఆ ప్రాంతంలో యుద్ధనౌకల సంఖ్యను రెట్టింపు చేయడమే కాకుండా, ఆకాశమార్గం ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టింది. : ‘ఎన్.వి. సన్షైన్’, ‘జగ్ వసంత్’, ‘పైన్ గ్యాస్’, ‘శివాలిక్’ వంటి పలు ఎల్పీజీ ఆయిల్ ట్యాంకర్లు ఎస్కార్ట్ లేకుండానే ప్రమాదకర జలసంధిని విజయవంతంగా దాటాయి. జలసంధిని సురక్షితంగా దాటిన తర్వాత భారత యుద్ధనౌకలు వీటికి ఎస్కార్ట్ ఇస్తూ దేశానికి చేరుస్తున్నాయి. యుద్ద వాతావరణం ఉన్నప్పటికీ కేంద్రం తీసుకున్న ఈ చర్యల వల్ల భారత్కు వంట గ్యాస్ (LPG), ముడి చమురు సరఫరాలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా భారీ ఉపశమనం లభించింది.

