హైదరాబాద్లో చెరువుల పునరుద్ధరణ పనులతో పాటు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (STPs) కూడా సమయానికి సిద్ధం కావాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులకు స్పష్టం చేశారు. చెరువులు పూర్తయ్యాక కూడా మురుగు నీరు చేరకుండా ఉండాలంటే STPs కీలకమని ఆయన తెలిపారు.

రాజేంద్రనగర్ మండలం ఇబ్రహీంబాగ్ చెరువును గురువారం సందర్శించిన కమిషనర్, జరుగుతున్న పనులను పరిశీలించారు. పూడిక పూర్తిగా తొలగించి చెరువులో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. చెరువుల పునరుద్ధరణ పూర్తయ్యే సమయానికి STPs సిద్ధంగా లేకపోతే మళ్లీ కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

జలమండలి అధికారులు 56 MLD సామర్థ్యంతో STPs నిర్మాణం జరుగుతోందని వివరించారు. STP నీటిని ముందుగా సెడిమెంటేషన్ పాండ్లోకి మళ్లించి, ఆ తర్వాతే చెరువులోకి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇబ్రహీంబాగ్ చెరువు దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, ఆక్రమణలను ఇప్పటికే తొలగించినట్లు తెలిపారు. చెరువు చుట్టూ పాత్వేలు, పర్యావరణ అభివృద్ధి పనులు చేపట్టి అన్ని వయసుల వారికి అనుకూలంగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు.అలాగే, కుడికుంట చెరువు అభివృద్ధి పనులను కూడా పరిశీలించిన కమిషనర్, చెరువు పరిధిలోని భూములను రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. చెరువులను ఆదాయ వనరులుగా అభివృద్ధి చేసే ప్రయత్నాలను అభినందించారు.
