వాడపల్లి. (బిఎన్ఎస్)మార్చి 27..కోనసీమలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్వహించనున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు సందర్భంగా ఆహ్వాన పత్రికను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కి ఆలయ డిప్యూటీ కమిషనర్ & కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధరరావు మర్యాదపూర్వకంగా అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం ని ఆహ్వానిస్తూ, అంగరంగ వైభవంగా జరగనున్న ఈ దివ్య కళ్యాణ మహోత్సవాలకు విచ్చేసి స్వామి వారి కృపను పొందాలని కోరారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ : కోనసీమ ప్రాంతానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యతను మరింత పెంచే విధంగా ఈ మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని తెలిపారు . అలాగే సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
భక్తులకు సౌకర్యవంతమైన దర్శన ఏర్పాట్లు, తాగునీరు, ప్రసాదాల పంపిణీ, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య శిబిరాలు, భద్రతా ఏర్పాట్లు వంటి అన్ని అంశాలలో సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులకు సూచించారు. అలాగే ఆలయ పరిసరాలలో పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక శానిటేషన్ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
ఈ దివ్య కళ్యాణ మహోత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించడంతో పాటు, ప్రాంతీయ పర్యాటక అభివృద్ధికి కూడా దోహదపడతాయని మంత్రి ఆనం పేర్కొన్నారు.
