విజయవాడ (బీఎన్ఎస్) ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఇటీవల వేర్వేరు ప్రమాదాల్లో మరణించిన 14 మంది జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలను జనసేన పార్టీ ఆదుకొంది. రూ.5 లక్షల చొప్పున రూ.70 లక్షల విలువైన బీమా చెక్కులను పార్టీ అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి, శాసనమండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ పంపిణీ చేశారు. సోమవారం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ చెక్కులను క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు అందజేశారు. కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కష్టం కాలంలో కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక భరోసా నింపాలన్న సదుద్దేశంతో పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
