జూబ్లీహిల్స్ అమ్మాయిల ట్రాప్ కేసులో మరో నలుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ప్రధాన నిందితుడు అర్జున్ తల్లి, మేనమామ, ఇద్దరు స్నేహితులు ఉన్నారు. బాలికలను ట్రాప్ చేయడంలో అర్జున్, ప్రవీణ్ లకు ఈ నలుగురు నిందితులు సహకరించినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన నలుగురిని నాంపల్లి కోర్టుకు తరలించారు.
అన్నదమ్ములు అర్జున్, ప్రవీణ్లు అమ్మాయిలను ట్రాప్ చేసి కార్లలో తిప్పుతూ లైంగిక దాడులకు పాల్పడేవారని పోలీసులు అభియోగాలు మోపారు. ఆ వీడియోలను ఉపయోగించి బాధితులను బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. జూబ్లీహిల్స్ పోలీసులు, షీ టీమ్స్ సంయుక్తంగా జరిపిన విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఖరీదైన కార్లు, లగ్జరీ జీవనశైలిని ప్రదర్శిస్తూ బాలికలతో స్నేహం చేసేవారు. ప్రేమ పేరుతో వారిని లొంగదీసుకునేవారు. బాలికలతో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగేవారు.
