ప్రమాదం ఎలా జరిగింది?
ఆగస్టు 31న తెల్లవారుజామున Khajaguda -నానక్రామ్గూడ ఓఆర్ఆర్ రోటరీ మార్గంలో ప్రమాదం జరిగింది. అంకుర ఆస్పత్రి సమీపంలో ఉదయం సుమారు 4.30 గంటలకు రోడ్డుపై వెళ్తున్న 31 ఏళ్ల నంద కిషోర్ కుమార్ రేను ఓ ఇన్నోవా క్రిస్టా ఢీకొట్టింది.
బిహార్కు చెందిన రే.. రాయదుర్గంలోని షా గౌస్ హోటల్లో హెల్పర్గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గాయపడిన వారికి సాయం చేస్తుండగా..
ప్రమాదానికి కారణమైన ఇన్నోవా క్రిస్టాను 21 ఏళ్ల జైద్ షా ఖాద్రీ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం తర్వాత ఖాద్రీ వాహనాన్ని ఆపి గాయపడిన రేకు సాయం చేసేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో సయ్యద్ అమీర్ హుస్సేన్ కూడా అక్కడికి చేరుకున్నాడు.
అయితే అదే సమయంలో మరో కారు అక్కడికి వచ్చి వారిని ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో నంద కిషోర్ కుమార్ రే తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
జైద్ షా ఖాద్రీ కుడి కాలుకు ఫ్రాక్చర్తో పాటు ఇతర గాయాలయ్యాయి. అతడిని గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సయ్యద్ అమీర్ హుస్సేన్కు ఎలాంటి గాయాలు కాలేదు.
సీసీటీవీతో రెండో వాహనం గుర్తింపు
ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన రాయదుర్గం పోలీసులు ఖజాగూడ-ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మార్గంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు.
ప్రమాదం తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయిన రెండో వాహనాన్ని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగించారు.
చివరకు ఆ వాహనం 23 ఏళ్ల బి. శివ సందీప్ సాయి ఆనంద్కు చెందినదిగా గుర్తించారు. అది మహీంద్రా ఎక్స్యూవీ ఎలక్ట్రిక్ కారు అని పోలీసులు తెలిపారు.
నంబర్ ప్లేట్ లేకపోవడంతో సవాల్
సెప్టెంబర్ 1న పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని సందీప్ను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో కారుకు నంబర్ ప్లేట్ లేదని గుర్తించారు. దీంతో వాహనాన్ని గుర్తించడం పోలీసులకు సవాల్గా మారింది.
అయితే చాసిస్, ఇంజిన్ నంబర్లతో పాటు సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించి వాహనం వివరాలను పోలీసులు నిర్ధారించారు.
డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు ఆర్టీఏకు లేఖ
ఈ కేసులో శివ సందీప్ సాయి ఆనంద్ డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేయాలని పోలీసులు నిర్ణయించారు.
ఈ మేరకు మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ ఆర్టీఏ అధికారులకు లేఖ రాశారు.
మరోవైపు సందీప్ రక్త నమూనాలను పరీక్షించగా ప్రాథమిక పరీక్షలో డ్రగ్స్కు సంబంధించిన ఆనవాళ్లు కనిపించలేదని పోలీసులు తెలిపారు.
అయితే తుది నిర్ధారణ కోసం ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.
ఇతర అంశాలపైనా దర్యాప్తు
డ్రైవింగ్ లైసెన్స్ రద్దుతో పాటు కేసులోని ఇతర అంశాలపైనా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రమాదానికి ముందు, తర్వాత వాహనం కదలికలు, సీసీటీవీ దృశ్యాలు, ఫోరెన్సిక్ నివేదిక వంటి అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.



