కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. నియోజకవర్గంలోని ఈతకోట వద్ద గోరింకల డ్రైన్పై శిథిలావస్థకు చేరిన బ్రిడ్జి పునర్నిర్మాణానికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని ఆయన వెల్లడించారు.
ఈతకోట వద్ద ఫోర్ లైన్ రహదారితో కూడిన నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం రూ. 2.90 కోట్ల నిధులు మంజూరయ్యాయి.నిధులు విడుదల చేసిన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు ఎమ్మెల్యే ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ బ్రిడ్జి పూర్తయితే ఈతకోట నుంచి దేవరపల్లి మీదుగా కొత్తపేట వచ్చే వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు తప్పుతాయని, భారీ వాహనాల రాకపోకలకు మార్గం సుగమం అవుతుందని ఆయన వివరించారు. అతి త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
