ఆవును ‘జాతీయ జంతువు’గా ప్రకటించాలని జమియత్ ఉలేమా-ఎ-హింద్ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ అర్షద్ మదానీ అన్నారు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. దేశంలోని మెజారిటీ వర్గం ఆవును పవిత్ర జంతువుగా మాత్రమే కాకుండా, తల్లిగా కూడా భావిస్తుందని, ఆవు పేరుతో జరిగే రాజకీయ ఆట ఇకనైనా అంతం కావాలని ఆకాంక్షించారు. మైనారిటీ వర్గంపై జరుగుతున్న విద్వేషపూరిత ప్రసంగాలు, దాడుల వెనుక ఈ పవిత్ర జంతువు చుట్టూ అల్లుకున్న విభజన రాజకీయాలే మూలకారణమని అన్నారు. ఆవును ‘జాతీయ జంతువు’గా ప్రకటించడం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుందని మదానీ అభిప్రాయపడ్డారు.
మతం పేరుతో జరిగే రాజకీయాల వల్ల ఎవరి ప్రాణాలు పోకూడదని మౌలానా సయ్యద్ అర్షద్ మదానీ అన్నారు. దేశంలో మత విభజన, విద్వేష రాజకీయాలకు శాశ్వత పరిష్కారం కావాలన్నారు. గోమాంసం విషయంలో వివిధ రాష్ట్రాలలో వివిధ చట్టాలు ఉన్నాయని, మతవిద్వేషంతో కూడిన దాడులు భక్తి అనబడదని, రాజకీయ కుతంత్రాలు అవుతాయన్నారు.

