నగర ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే లక్ష్యంతో జిహెచ్ఎంసి (GHMC) సికింద్రాబాద్ జోన్ పరిధిలో నిర్మించిన నూతన కార్యాలయాలను హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ప్రారంభించారు. ముషీరాబాద్ మరియు కవాడిగూడ సర్కిల్ కార్యాలయాలను మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి ఆయన ప్రారంభించారు.
సుమారు రూ. 10.50 కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక వసతులతో ఈ రెండు సర్కిల్ కార్యాలయాలను నిర్మించారు. పరిపాలన సౌలభ్యం కోసం GHMCని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించినట్లు మంత్రి తెలిపారు. రింగ్ రోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చామన్నారు. హైదరాబాద్ నగరం భవిష్యత్తులో ఢిల్లీ లాంటి కాలుష్య పరిస్థితులను ఎదుర్కోకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు పోతోందని మంత్రి స్పష్టం చేశారు.

GHMC లో విలీనమైన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక ‘ప్లాన్ ఆఫ్ యాక్షన్’ సిద్ధం చేశామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వీ కర్ణన్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
