మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో జూన్ 4న విడుదలైన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ ను చూపించిన విధానంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదంపై దర్శకుడు బుచ్చిబాబు సానా స్పందిస్తూ ప్రేక్షకులకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. ప్రేక్షకుల అభ్యంతరాలను గౌరవిస్తూ సినిమాలోని వివాదాస్పద సీన్లకు సంబంధించిన దాదాపు 3 నిమిషాల ఫుటేజీని థియేటర్ ప్రింట్ల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ వివాదంపై నటి నిత్య మీనన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను ఇంకా ఈ సినిమా చూడలేదని తెలిపిన ఆమె.. సినిమాల్లో మహిళలను కేవలం ఒక అందాల వస్తువుగా చూపించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానన్నారు. ఇలాంటి సీన్లు చేసేటప్పుడు నటీనటులకు కొన్ని హద్దులు ఉండాలని, తమకు నచ్చని సీన్లు ఉన్నప్పుడు మేము ఇది చేయలేమని నిర్మొహమాటంగా చెప్పే ధైర్యం ఉండాలన్నారు. కెరీర్ ప్రారంభం నుంచే ఇలాంటి విషయాల్లో కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యమని నిత్య మీనన్ స్పష్టం చేశారు. ఇది కేవలం ఒక్క పరిశ్రమకు సంబంధించిన సమస్య కాదని, బాలీవుడ్తో పాటు ప్రపంచవ్యాప్తంగా కమర్షియల్ సినిమాల్లో గ్లామర్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపింది.

