కడప జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మైదుకూరు నియోజకవర్గ వైసీపీకి గట్టి షాక్ ఇస్తూ, బ్రహ్మంగారిమఠం ఎంపీపీ వీరనారాయణరెడ్డి సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆయన చేరికకు మార్గం సుగమమైంది.

ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నివాసంలో వీరనారాయణరెడ్డి తన కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరులతో కలిసి పసుపు కండువా కప్పుకోనున్నారు. బ్రహ్మంగారిమఠం మండలంలో పట్టున్న నేతగా పేరున్న వీరనారాయణరెడ్డి చేరికతో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం కానుందని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ముందు కీలక నేతలు పార్టీని వీడటం వైసీపీకి జిల్లాలో పెద్ద దెబ్బగానే భావిస్తున్నారు.నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టీడీపీలో చేరుతున్నట్లు వీరనారాయణరెడ్డి అనుచరుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం.
