ఆంధ్రప్రదేశ్ను ఫిన్టెక్ హబ్గా మార్చే లక్ష్యంతో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అడుగులు వేస్తున్నారు. దావోస్ పర్యటనలో భాగంగా ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ ప్లాట్ఫామ్ జెరోధా (Zerodha) వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్తో ఆయన సమావేశమయ్యారు. విశాఖపట్నంలో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు.

ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్, డేటా అనలిటిక్స్, ఫిన్టెక్ ఆర్ అండ్ డీ (R&D) విభాగాలపై దృష్టి సారిస్తూ విశాఖపట్నంలో సెంటర్ను ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. రాష్ట్రంలో స్టార్టప్ ఎకో సిస్టమ్ను బలోపేతం చేసేందుకు ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్’కు లీడ్ మెంటర్గా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఆర్థిక అంశాలపై అవగాహన కల్పించేలా ‘ఫైనాన్సియల్ లిటరసీ’ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వంతో కలిసి అమలు చేయాలని కోరారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై నిఖిల్ కామత్ సానుకూలంగా స్పందించారు. భవిష్యత్ ప్రణాళికలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
