వరదలకు నైతిక బాధ్యత మీదే.. నష్టపరిహారం చెల్లించండి: భారత్, చైనా, అమెరికాకు నేపాల్ డిమాండ్

September 2, 2026 3:03 PM

కర్బన ఉద్గారాలే కారణమంటున్న నేపాల్

నేపాల్‌లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.

వెయ్యి మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. భారీగా ఆస్తి నష్టం జరిగింది. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు, సహాయక చర్యలు, పునరావాసం, పునర్నిర్మాణం కోసం నేపాల్‌కు భారీగా నిధులు అవసరం అవుతున్నాయి.

దీంతో ప్రపంచ దేశాలు నేపాల్‌కు తమ వంతు సాయం అందిస్తున్నాయి.

అయితే ఈ సాయం విషయంలో నేపాల్ కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చింది. తమకు దయ, జాలితో చేసే సాయం అవసరం లేదని.. నైతిక బాధ్యతగా నష్టపరిహారం చెల్లించాలని భారత్, చైనా, అమెరికాలను కోరింది.

ప్రపంచంలో అత్యధిక కర్బన ఉద్గారాలు విడుదల చేస్తున్న దేశాల్లో ఉన్న అమెరికా, చైనా, భారత్.. వాతావరణ మార్పుల కారణంగా తమ దేశానికి జరుగుతున్న నష్టానికి పరిహారం చెల్లించాలని నేపాల్ డిమాండ్ చేసింది.

‘మాకు భిక్ష అవసరం లేదు.. పరిహారం చెల్లించండి’

నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి శిశిర్ కనాల్ మాట్లాడుతూ.. తమ దేశం చాలా స్వల్ప మొత్తంలో కర్బన ఉద్గారాలను విడుదల చేస్తోందని చెప్పారు.

అయితే ప్రపంచ వాతావరణ మార్పులు, వాటి తీవ్ర ప్రభావాలను నేపాల్ ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రీన్‌హౌస్ వాయువులను ఎక్కువగా విడుదల చేసే దేశాలకు.. వాతావరణ మార్పుల వల్ల నష్టపోయే నేపాల్ లాంటి దేశాల పట్ల బాధ్యత ఉంటుందని శిశిర్ అన్నారు.

తమ దౌత్య విధానాన్ని సాయం కోరే స్థాయి నుంచి న్యాయబద్ధమైన పరిహారం డిమాండ్ చేసే దిశగా మారుస్తున్నామని వెల్లడించారు.

ఈ పరిహారం కోసం నేపాల్ ఇప్పటికే అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలకు వాతావరణ పరిహారం క్లెయిమ్‌ను పంపించింది.

రాబోయే రోజుల్లో అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాన్ని బలంగా లేవనెత్తుతామని నేపాల్ విదేశాంగ మంత్రి చెప్పారు.

న్యాయం కోసం ఐక్యరాజ్య సమితి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లాలని నేపాల్ ప్రభుత్వం భావిస్తోంది.

ఐక్యరాజ్య సమితి వేదికపై ప్రస్తావించే అవకాశం

ఐక్యరాజ్య సమితి 81వ సర్వసభ్య సమావేశానికి నేపాల్ ప్రధాని బాలేంద్ర షా హాజరయ్యే అవకాశం ఉంది.

ఈ సందర్భంగా ఇటీవల సంభవించిన వరదలు, వాతావరణ మార్పుల ప్రభావాలపై ఆయన మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నేపాల్ చేస్తున్న వాతావరణ నష్టపరిహారం డిమాండ్‌కు నైతికంగా, రాజకీయంగా బలమైన ప్రాతిపదిక ఉందని నిపుణుల వాదన.

అయితే ప్రస్తుత అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ డిమాండ్‌ను నేరుగా అమలు చేయడం మాత్రం కష్టమే.

2015 నాటి పారిస్ ఒప్పందంలో వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టం, నష్టపరిహారం అంశాలను చర్చించారు.

అయితే ఆ ఒప్పందం ఆధారంగా ఏదైనా దేశంపై నేరుగా దావా వేసి పరిహారం పొందే అవకాశం లేదు.

COP27, COP28 సదస్సుల్లో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్‌ను ఏర్పాటు చేశారు.

కర్బన ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేసే లేదా అభివృద్ధి చెందిన దేశాలు స్వచ్ఛందంగా అందించే నిధులే ఇందులో ఉంటాయి.

ఇవి జరిమానా లేదా తప్పనిసరి నష్టపరిహారం కావు.

అంతర్జాతీయ పర్యావరణ సూత్రాల ప్రకారం కాలుష్యానికి కారణమైన దేశమే నష్టపరిహారం చెల్లించాలనే వాదన ఉంది.

అయితే అంతర్జాతీయ న్యాయస్థానం లేదా ఇతర ట్రైబ్యునళ్ల ద్వారా పరిహారాన్ని వసూలు చేసుకోవడం నేపాల్‌కు సాధ్యం కాకపోవచ్చు.

కర్బన ఉద్గారాల్లో టాప్-5 దేశాలు

కర్బన ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేసే దేశాల్లో చైనా, అమెరికా, భారత్, రష్యా, జపాన్ టాప్-5లో ఉన్నాయి.

అయితే తలసరి ఉద్గారాలను పరిశీలిస్తే అభివృద్ధి చెందిన దేశాలు ముందువరుసలో ఉంటాయి.

సగటున ఒక అమెరికా పౌరుడు ఏడాదికి 13.59 టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తే.. భారత పౌరుడు 2.19 టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను మాత్రమే విడుదల చేస్తున్నాడు.

నేపాల్‌కు భారత్ సహా దేశాల సాయం

నేపాల్‌లో ఆకస్మిక వరదలు వచ్చిన వెంటనే భారత్ సహాయక చర్యలు చేపట్టింది.

వరదలు వచ్చిన రోజే మానవతా సాయాన్ని పంపించింది. ఇప్పటివరకు 68.5 టన్నులకుపైగా మానవతా సహాయ సామాగ్రిని భారత్ పంపించింది.

సొరంగాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సాంకేతిక బృందాలను పంపడంతోపాటు.. మృతదేహాలను గుర్తించేందుకు ఫోరెన్సిక్, డీఎన్ఏ నిపుణులను కూడా రంగంలోకి దించింది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూఏఈ ఎయిడ్ ఏజెన్సీ ద్వారా 10 మిలియన్ డాలర్ల అత్యవసర సాయాన్ని ప్రకటించింది.

యునైటెడ్ కింగ్‌డమ్ 5 మిలియన్ పౌండ్ల ఆర్థిక సాయం ప్రకటించింది. ఆస్ట్రేలియా 5 మిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీని ప్రకటించింది.

దక్షిణ కొరియా, శ్రీలంక చెరో 1 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించాయి.

అమెరికా 5 లక్షల డాలర్ల తక్షణ నిధులతోపాటు విపత్తు నిర్వహణ సలహాదారులను పంపించింది.

చైనా అత్యవసర నగదు, ప్రథమ చికిత్స సామాగ్రితోపాటు టన్నెల్ రెస్క్యూ టీమ్‌ను పంపించింది.

పునర్నిర్మాణానికి భారీ నిధులు

నేపాల్‌లో మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం కోసం వరల్డ్ బ్యాంక్ 163.55 మిలియన్ డాలర్ల అత్యవసర సాయాన్ని ప్యాకేజీగా సిద్ధం చేసింది.

ఐక్యరాజ్య సమితి అత్యవసర వైద్యం, తాగునీరు, వసతుల కల్పన కోసం 2.5 మిలియన్ డాలర్లు విడుదల చేసింది.

ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ కూడా తక్షణ సాయం కోసం 1 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లను విడుదల చేసింది.

భారత్, చైనా, అమెరికా తమకు వాతావరణ నష్టపరిహారం చెల్లించాలని నేపాల్ చేసిన డిమాండ్‌పై మీ అభిప్రాయం ఏమిటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో పంచుకోండి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media