ఉపాధ్యాయ అభ్యర్థుల నిరసన హింసాత్మకం
- ఒకే దశలో ఉపాధ్యాయ నియామక పరీక్ష నిర్వహించాలని, నెగెటివ్ మార్కులు రద్దు చేయాలని అభ్యర్థుల డిమాండ్
- పోలీసుల లాఠీఛార్జ్కు ప్రతిగా నిరసనకారులు రాళ్లు రువ్వడంతో ఘర్షణ
- విద్యార్థులు, పోలీసులు సహా పలువురికి గాయాలు.. పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
బీపీఎస్సీ పరీక్షలపై అభ్యర్థుల ఆందోళన
బిహార్ రాజధాని పట్నాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) నిర్వహించనున్న ఉపాధ్యాయ నియామక పరీక్షల ప్రక్రియను వ్యతిరేకిస్తూ విద్యార్థులు, నిరుద్యోగ యువత చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది.
మంగళవారం సీఎం నివాసం ముట్టడికి బయల్దేరిన అభ్యర్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఒకే పరీక్ష.. నెగెటివ్ మార్కులు వద్దు
ఉపాధ్యాయ నియామక పరీక్షను రెండు దశల్లో కాకుండా ఒకే దశలో నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు.
నెగెటివ్ మార్కులను తొలగించాలని, ఉద్యోగాలన్నీ స్థానికులకే కేటాయించాలని కోరారు. ఈ డిమాండ్లతో గాంధీ మైదాన్ నుంచి ర్యాలీగా బయల్దేరారు.
వారిని డాక్బంగ్లా చౌక్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. మొదట వాటర్ కేనన్లను ప్రయోగించినా నిరసనకారులు వెనక్కి తగ్గలేదు.
దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీనికి ప్రతిగా ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి తీవ్రంగా మారింది.
చైర్మన్ వ్యాఖ్యలతో మరింత ఆగ్రహం
నిరసనకు ముందురోజు బీపీఎస్సీ చైర్మన్ రాకేశ్కుమార్సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి మరింత ఆజ్యం పోశాయి.
నిరసనకారులను ఉద్దేశించి ఆయన “ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతాయి” అని వ్యాఖ్యానించారు.
దీనిపై యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ వ్యాఖ్యలను ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ కూడా ఖండించారు.
తీవ్ర వ్యతిరేకత రావడంతో చైర్మన్ విచారం వ్యక్తం చేసినప్పటికీ నిరసనకారులు శాంతించలేదు.
పలువురికి గాయాలు.. అదుపులోకి నిరసనకారులు
కొన్ని గంటల పాటు పట్నా వీధుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. పోలీసులతో జరిగిన ఘర్షణలో విద్యార్థులు, పోలీసులు సహా పలువురికి గాయాలయ్యాయి.
పోలీసులు పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా, 32,388 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి బీపీఎస్సీ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది.



