Ram charan కెరీర్లో మరో భారీ ఓపెనింగ్
దేశవ్యాప్తంగా విడుదలైన క్రీడా నేపథ్య యాక్షన్ డ్రామా
హైదరాబాద్: Ram charan హీరోగా నటించిన ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఘన ఆరంభం నమోదు చేసింది. తొలి రోజే రూ.135.36 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ శుక్రవారం ప్రకటించింది.
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ క్రీడా నేపథ్య యాక్షన్ డ్రామా గురువారం దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. చిత్రానికి విమర్శకుల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది.
ఈ సినిమాను నిర్మించిన వృద్ధి సినిమాస్ సంస్థ ఇన్స్టాగ్రామ్లో తొలి రోజు వసూళ్ల వివరాలను వెల్లడించింది. “బాక్సాఫీస్ ఛాంపియన్ – పెద్ది సార్… తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.135.36 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. పెద్ది ఇప్పుడు థియేటర్లలో ప్రదర్శితమవుతోంది” అని పోస్టు చేసింది.
‘గేమ్ ఛేంజర్’ తర్వాత బలమైన పునరాగమనం
Ram charan గత చిత్రం ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో ‘పెద్ది’ తొలి రోజు వసూళ్లు ఆయనకు బలమైన పునరాగమనంగా సినీ వర్గాలు భావిస్తున్నాయి.
1980ల గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సాగే ఈ కథలో దిగువ వర్గానికి చెందిన ఓ యువకుడు తన సమాజానికి గుర్తింపు, గౌరవం తీసుకురావాలనే లక్ష్యంతో రెజ్లింగ్ను ఎంచుకుంటాడు. రామ్చరణ్ ‘పెద్ది’ పాత్రలో నటించారు. ఆయన గురువు గౌర్నాయుడు పాత్రలో శివ రాజ్కుమార్ కనిపించారు. కథానాయికగా జాన్వీ కపూర్ నటించగా, జగపతిబాబు, దివ్యేందు, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఛాయాగ్రహణం రత్నవేలు నిర్వహించారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మించగా, ఐవీ ఎంటర్టైన్మెంట్ తరఫున ఇషాన్ సక్సేనా సహ నిర్మాతగా వ్యవహరించారు.
Also Read

