తెలంగాణను ప్రపంచ స్థాయి పారిశ్రామిక, సాంకేతిక కేంద్రంగా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్లో తన పర్యటనను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్తో ఆయన సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ‘తెలంగాణ రైజింగ్ విజన్-2047’పై టాటా చైర్మన్ ప్రశంసలు కురిపించారు.

అత్యంత ప్రతిష్టాత్మకమైన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై టాటా గ్రూప్ ప్రత్యేక ఆసక్తి కనబరిచింది. రాజస్థాన్, మహారాష్ట్రల్లో తమకు ఉన్న అనుభవంతో మూసీ అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి చంద్రశేఖరన్ సిద్ధమని ప్రకటించారు. హైదరాబాద్లోని స్టేడియాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దడం, ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ ఏర్పాటుపై చర్చించారు. 2036 ఒలింపిక్స్లో భారత్ పతకాలు సాధించడమే లక్ష్యంగా మౌలిక సదుపాయాల కల్పనలో టాటా గ్రూప్ సహకరించనుంది. 65 ప్రభుత్వ ఐటీఐలను టెక్ సెంటర్లుగా మార్చడంలో ఇప్పటికే టాటా టెక్నాలజీస్ భాగస్వామిగా ఉంది. పాలిటెక్నిక్ కాలేజీలను కూడా స్కిల్ సెంటర్లుగా మార్చే ప్రక్రియలో తోడ్పాటును కోరారు.

మేడారం, వేములవాడ, భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాల్లో అత్యాధునిక హోటళ్లు, శ్రీశైలం రహదారిలో అంతర్జాతీయ స్థాయి రిసార్ట్ ఏర్పాటుకు టాటా గ్రూప్ సానుకూలంగా స్పందించింది.
ఏఐ డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీ రంగాల్లో తెలంగాణలో కొత్త పరిశ్రమల స్థాపనపై చర్చలు జరిగాయి.ఈ సమావేశంలో మంత్రులు డి. శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
