నేపాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్న సోనూ సూద్
కాట్మాండు: బాలీవుడ్ నటుడు సోనూ సూద్ నేపాల్ వరద బాధితులకు అండగా నిలిచారు.
అక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటూ బాధితులకు రిలీఫ్ మెటీరియల్ అందిస్తున్నారు.
సోనూసూద్ ఛారిటీ క్లబ్ తరఫున ఈ సాయం చేస్తున్నారు.
మంగళవారం నేపాల్ వెళ్లిన సోనూ సూద్.. బుధవారం ఉదయం త్రిశూలీ బజార్ను సందర్శించారు.
ఆగస్టు 26న సంభవించిన వరదలతో త్రిశూలీ నది పరివాహక ప్రాంతంలోని త్రిశూలీ గ్రామం, బజార్ పూర్తిగా దెబ్బతిన్నాయి.
అక్కడ కనిపించిన విధ్వంసం తనను కలచివేసిందని సోనూ సూద్ చెప్పారు.
వరదల్లోనూ చెక్కుచెదరకుండా నిలిచిన ఇల్లు
త్రిశూలీ నదిలో బురద, బండరాళ్లతో కూడిన వరద పోటెత్తినప్పటికీ ఓ ఇల్లు మాత్రం చెక్కుచెదరకుండా నిలిచింది.
లైట్ గ్రీన్ రంగులో ఉన్న ఈ ఇంటిని ఇప్పుడు **‘మిరాకిల్ హౌజ్’**గా పిలుస్తున్నారు.
ఈ ఇంటి వద్దకు కూడా సోనూ సూద్ చేరుకున్నారు. వరద సమయంలో ఆ ఇల్లు ఎలా సురక్షితంగా నిలిచిందో చూడవచ్చని ఆయన అన్నారు.
వరదల సమయంలో ఆ ఇంట్లోని ఆరుగురు పైకప్పుపై నిల్చుని తమ ప్రాణాలను కాపాడుకున్నారు.
బాధితులకు మరింత సాయం చేస్తాం
సుమారు 9 గంటలు ప్రయాణించిన తర్వాత తాము త్రిశూలీ ప్రాంతానికి చేరుకున్నామని సోనూ సూద్ చెప్పారు.
ఇక్కడ చాలామంది ఇళ్లు, కుటుంబాలను కోల్పోయారని, వారిని చూస్తుంటే బాధగా ఉందన్నారు.
వరదల కారణంగా చేరుకోవడం కష్టమైన ప్రాంతాలకు కూడా వెళ్లి.. వీలైనంత సాయం అందించనున్నట్లు సోనూ సూద్ తెలిపారు.



