స్పేస్‌ఎక్స్‌ ఐపీవో సంచలనం.. మస్క్‌కు ట్రిలియనీర్‌ అవకాశం?

June 4, 2026 3:12 PM
SpaceX IPO Elon Musk with SpaceX logo ahead of historic IPO and AI expansion plans

షేరుకు 135 డాలర్ల అంచనా.. 1.75 ట్రిలియన్‌ డాలర్ల విలువ

ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ తన ఐపీవోకు ముందే షేర్‌ ధరపై అంచనాను వెల్లడించింది. కంపెనీ దాఖలు చేసిన పత్రాల ప్రకారం ఒక్కో షేర్‌ను 135 డాలర్లు (సుమారు 100 పౌండ్లు)గా విక్రయించాలని భావిస్తోంది.

ఈ ధర ఆధారంగా స్పేస్‌ఎక్స్‌ విలువ సుమారు 1.75 ట్రిలియన్‌ డాలర్లకు చేరనుంది.

ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ విలువ 1.25 ట్రిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు. తాజా ప్రతిపాదనతో ఆ విలువ భారీగా పెరిగింది. స్టాక్‌ మార్కెట్లోకి రాకముందే ఇంత ముందుగా అంచనా ధర ప్రకటించడం చాలా అరుదుగా జరుగుతుంది.

అయితే ప్రకటించిన ధరకే షేర్లు అమ్ముడవుతాయన్న హామీ లేదు. పెట్టుబడిదారుల డిమాండ్‌ను బట్టి ధర పెరగవచ్చు, తగ్గవచ్చు.

జూన్‌ 12న నాస్‌డాక్‌లో ట్రేడింగ్‌

అంతరిక్ష అన్వేషణ రాకెట్లు, మౌలిక సదుపాయాలు నిర్మించే స్పేస్‌ఎక్స్‌.. స్టార్‌లింక్‌, ఎక్స్‌ఏఐ సంస్థలకు కూడా యజమానిగా ఉంది. జూన్‌ 12న నాస్‌డాక్‌ స్టాక్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ ప్రారంభించే అవకాశం ఉంది.

సాధారణంగా కంపెనీలు ట్రేడింగ్‌కు ముందు రోజు మాత్రమే ఐపీవో ధరను వెల్లడిస్తాయి. కానీ స్పేస్‌ఎక్స్‌ వారం కంటే ముందే ధర అంచనాను ప్రకటించడం విశేషంగా మారింది. స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో అత్యంత ముందుగా వెల్లడించిన ధర అంచనాల్లో ఇది ఒకటిగా నిలవొచ్చు.

ఈ ఐపీవో ద్వారా 75 బిలియన్‌ డాలర్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అది సాధ్యమైతే ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవోగా రికార్డు సృష్టిస్తుంది.

ప్రస్తుతం ఈ రికార్డు 2019లో 25.6 బిలియన్‌ డాలర్లు సమీకరించిన సౌదీ అరామ్‌కో పేరిట ఉంది.

ప్రపంచ దిగ్గజాల సరసన స్పేస్‌ఎక్స్‌

షేర్లు 135 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ధరకు విక్రయమైతే స్పేస్‌ఎక్స్‌ ప్రపంచంలో అత్యంత విలువైన సంస్థల్లో ఒకటిగా నిలుస్తుంది.

కంపెనీలో 80 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్న మస్క్‌ సంపద కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. దీంతో ఆయన ట్రిలియనీర్‌గా మారవచ్చన్న చర్చ మొదలైంది.

అయితే ఆ పరిస్థితి ఖాయమని చెప్పలేమని మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు.

మూలధన మార్కెట్లపై పరిశోధనలు చేసే డీలాజిక్‌ గణాంకాల ప్రకారం, గత 30 ఏళ్లలో పబ్లిక్‌ మార్కెట్లోకి వచ్చిన కంపెనీల్లో దాదాపు సగం సంస్థల విలువ లిస్టింగ్‌ తర్వాత తగ్గింది.

మర్‌జర్‌మార్కెట్‌ ఈక్విటీ క్యాపిటల్‌ మార్కెట్ల పరిశోధన విభాగం అధిపతి శామ్యూల్‌ కెర్ మాట్లాడుతూ, “స్పేస్‌ఎక్స్‌ విలువ అంచనా చాలా ఎక్కువగా ఉంది” అన్నారు.

పెట్టుబడిదారులు “మ్యాగ్‌ 7″గా పిలిచే ఆల్ఫాబెట్‌, అమెజాన్‌, ఆపిల్‌, మెటా, ఎన్విడియా, మైక్రోసాఫ్ట్‌, టెస్లా సంస్థలతో పోలిస్తే అమ్మకాలతో పోల్చిన విలువ నిష్పత్తి స్పేస్‌ఎక్స్‌లో మరింత ఎక్కువగా ఉందని చెప్పారు.

అయితే ప్రస్తుత లాభనష్టాల కంటే భవిష్యత్‌ ఆదాయ అవకాశాల ఆధారంగా కంపెనీకి విలువ కడుతున్నారని, అందువల్ల కొందరు పెట్టుబడిదారులు ఈ అధిక విలువ అంచనాను పట్టించుకోకపోవచ్చని పేర్కొన్నారు.

ఆదాయం పెరిగినా నష్టాలు కొనసాగుతున్నాయి

అధికారికంగా స్పేస్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ టెక్నాలజీస్‌గా పిలిచే ఈ సంస్థ గత ఏడాది 18.6 బిలియన్‌ డాలర్ల ఆదాయం సాధించింది.

అయితే నికరంగా 4.9 బిలియన్‌ డాలర్ల నష్టాన్ని నమోదు చేసింది.

ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 4.7 బిలియన్‌ డాలర్ల అమ్మకాలు నమోదు చేసినప్పటికీ 4.3 బిలియన్‌ డాలర్ల నష్టం వచ్చింది.

కంపెనీ బ్యాలెన్స్‌ షీట్‌ ప్రకారం రాకెట్లు, ఇతర పరికరాలతో కలిపి 102 బిలియన్‌ డాలర్ల ఆస్తులు ఉన్నాయి. అదే సమయంలో 60.5 బిలియన్‌ డాలర్ల అప్పులు కూడా ఉన్నాయి.

ఏఐపై భారీ పెట్టుబడులు

అంతరిక్ష రంగంతో పాటు కృత్రిమ మేధ, సామాజిక మాధ్యమాలు, అంతరిక్ష ఆధారిత ఇంటర్నెట్‌ సేవలు, డేటా సెంటర్లలో కూడా స్పేస్‌ఎక్స్‌ భారీగా పెట్టుబడులు పెడుతోంది.

ఈ ఏడాది ప్రారంభంలో మస్క్‌కు చెందిన మరో సంస్థ ఎక్స్‌ఏఐని స్పేస్‌ఎక్స్‌ కొనుగోలు చేసింది. గ్రోక్‌ చాట్‌బాట్‌తో ఎక్స్‌ఏఐ ఇప్పటికే గుర్తింపు పొందింది.

మొదట ట్విటర్‌గా ఉన్న ఎక్స్‌ వేదికలో భాగంగా ఎక్స్‌ఏఐ ప్రారంభమైంది. ఆ వేదికలోని ప్రత్యక్ష సమాచారం, పోస్టులను ఏఐ శిక్షణ డేటాగా ఉపయోగించింది.

భూమిపై వనరులు పరిమితంగా ఉన్న నేపథ్యంలో ఏఐ అభివృద్ధికి అవసరమైన శక్తి, మౌలిక వసతులను సమకూర్చేందుకు అంతరిక్ష మౌలిక సదుపాయాలే ఉత్తమ మార్గమని మస్క్‌ చాలా కాలంగా చెబుతున్నారు.

ఏఐ ఉపగ్రహాలను ప్రయోగించడం, భవిష్యత్తులో కక్ష్యలోనే డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం వంటి ప్రణాళికలను కూడా ఆయన వెల్లడించారు.

భవిష్యత్‌ సాంకేతిక రంగంపై పెట్టుబడిదారుల చూపు

అమెరికా వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ సిట్రిన్‌ వెంచర్‌ పార్ట్‌నర్స్‌ మేనేజింగ్‌ పార్ట్నర్‌ రూత్‌ ఫాక్స్‌-బ్లేడర్‌ మాట్లాడుతూ, స్పేస్‌ఎక్స్‌ చేపడుతున్న విస్తృత ప్రాజెక్టులే పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయని చెప్పారు.

“స్పేస్‌ఎక్స్‌ అనేది అనేక రంగాలను కలిపిన భారీ ప్రాజెక్టు. భవిష్యత్తును సూచించే ఎన్నో అవకాశాలు ఇందులో కనిపిస్తున్నాయి” అని ఆమె వ్యాఖ్యానించారు.

స్పేస్‌ఎక్స్‌ ఐపీవో వస్తున్న సమయంలోనే ఇతర టెక్‌ దిగ్గజాలు కూడా ఏఐ పెట్టుబడుల కోసం నిధులు సమీకరించే ప్రయత్నాల్లో ఉన్నాయి.

ఈ వారం ఏఐ సంస్థ ఆంత్రోపిక్‌ కూడా ఈ ఏడాది చివర్లో షేర్‌ విక్రయ ప్రణాళికను ప్రకటించింది.

మరోవైపు గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ ఏఐ పెట్టుబడుల కోసం 80 బిలియన్‌ డాలర్లు సమీకరించాలని భావిస్తున్నట్లు తెలిపింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media