విజయనగరం జిల్లాలోని చారిత్రాత్మక పుణ్యక్షేత్రం రామతీర్థం నీలాచల కొండవద్ద వెలసిన సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో శ్రీరామనవమి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ‘ఉత్తర అయోధ్య’గా పేరుగాంచిన ఈ క్షేత్రంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎం.ఎస్.ఎం.ఈ, సెర్ప్, ఎన్నారై సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరై, స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉదయం నుంచే వేలాదిగా తరలివచ్చిన భక్తుల మధ్య, వేద పండితుల మంత్రోచ్ఛారణలతో అభిషేకాలు, అర్చనలు శాస్త్రోక్తంగా జరిగాయి. అనంతరం నిర్వహించిన సీతారాముల కల్యాణ మహోత్సవం భక్తులకు కనులపండువగా నిలిచింది. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. శ్రీరామనవమి పర్వదినం సమాజానికి ధర్మం, న్యాయం, సత్యం వంటి విలువలను గుర్తు చేస్తుందని అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం మరియు కల్యాణ వీక్షణ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
