తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకొంటోంది. ఈ సందర్భంగా అనేక చోట్ల పార్టీ జెండాలు ఎగరవేసి, కార్యకర్తలు సందడి చేస్తున్నారు. పార్టీ శ్రేణులకు అధ్యక్షులు చంద్రబాబు శుభాకాంక్షలు తెలియచేశారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి కార్యకర్త ఇంటి పండుగలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ‘తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇది కార్యకర్తల పార్టీ. ఈ పండుగ సందర్భంగా ప్రతి కార్యకర్తకు పేరుపేరునా శుభాకాంక్షలు తెలుపుతున్నాను,’ అని చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు. యుగపురుషుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ, తరతరాల తెలుగు వారి ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచిందన్నారు.
పేదవారికి కూడు, గూడు, గుడ్డ అందించాలనే ఎన్టీఆర్ సిద్ధాంతాన్ని తమ పార్టీ సదా పాటిస్తోందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
