ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ‘మేడారం సమ్మక్క-సారలమ్మ’ మహాజాతరలో చిలుకలగుట్ట ఒక ఆధ్యాత్మిక కేంద్రబిందువు. ఇక్కడి ఒక సాధారణ రాయి, భక్తుల నమ్మకంతో సాక్షాత్తూ అమ్మవారి కుంకుమ బరణిగా మారి పూజలందుకుంటోంది.
కాకతీయులతో యుద్ధం తర్వాత సమ్మక్క తల్లి చిలుకలగుట్ట వైపు వెళ్లి అదృశ్యమైందని, అక్కడ వెతికిన గిరిజనులకు ఒక పుట్ట దగ్గర కుంకుమ బరణి లభించిందని చరిత్ర చెబుతోంది. ఆనాటి నుండి చిలుకలగుట్ట అమ్మవారి నివాసస్థానంగా భక్తులు భావిస్తారు. గుట్టపై ఉన్న ఒక ప్రత్యేకమైన శిలను భక్తులు’కుంకుమ బరణి’గా కొలుస్తారు. జాతర సమయంలోనే కాకుండా నిత్యం వేలాది మంది భక్తులు ఈ గుట్టను అధిరోహించి, ఆ శిలపై కుంకుమ వేస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.ప్రతిరోజూ వందలాది మంది భక్తులు సమర్పించే కుంకుమతో ఆ శిల పూర్తిగా ఎర్రగా మారి, అమ్మవారి శక్తికి నిదర్శనంగా కనిపిస్తుంది. మన సంస్కృతి, భక్తికి ఈ ప్రాంతం ఒక సజీవ సాక్ష్యం. మేడారం జాతరలో గద్దెలపైకి అమ్మవారిని తీసుకురావడానికి ముందు, పూజారులు చిలుకలగుట్టపైనే రహస్య పూజలు నిర్వహించి కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకురావడం జాతరలోనే అత్యంత ఉత్కంఠభరిత ఘట్టం.
