తూర్పు గోదావరి జిల్లాలో గత ఆరు రోజులుగా భయాందోళనలు సృష్టించిన పెద్దపులి కథ సుఖాంతమైంది. రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలోని ఒక పశువుల పాకలో నక్కిన పులిని అటవీ శాఖ అధికారులు మత్తుమందు ఇచ్చి విజయవంతంగా బంధించారు.
శుక్రవారం ఉదయం గ్రామంలోని ఒక పాడుబడిన ఇంట్లో పులి ఉన్నట్లు గుర్తించిన అధికారులు, దానిని బంధించే ప్రయత్నం చేశారు. అయితే జనాల కేకలు, అలికిడికి భయపడిన పులి అక్కడి నుంచి తప్పించుకుని సమీపంలోని పొలాల్లోకి, ఆపై పశువుల పాకలోకి వెళ్లింది. పూణే మరియు ఢిల్లీ నుంచి వచ్చిన వన్యప్రాణి నిపుణులు, అటవీ శాఖ సిబ్బంది సమన్వయంతో రాత్రి వరకు ఆపరేషన్ నిర్వహించారు. మూడుసార్లు మత్తు ఇంజక్షన్లు ప్రయోగించగా, చివరికి పులి స్పృహ కోల్పోయింది. స్పృహ తప్పిన పులిని అధికారులు సురక్షితంగా బోనులోకి చేర్చి, వైద్య పరీక్షల నిమిత్తం విశాఖపట్నం జూ (ZOO) కి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
మహారాష్ట్రలోని తడోబా అభయారణ్యం నుంచి సుమారు 250 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన ఈ పులి, జిల్లాలో ఎనిమిది పశువులను చంపింది. ఎట్టకేలకు పులి పట్టుబడటంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
