తెలుగు చిత్రసీమలో బహుముఖ ప్రజ్ఞాశాలి, దర్శకుడు, నిర్మాత, నటుడు మరియు రాజకీయ విశ్లేషకుడిగా గుర్తింపు పొందిన త్రిపురనేని చిట్టిబాబు మంగళవారం (ఏప్రిల్ 21) సాయంత్రం కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు.
17 ఏళ్ల వయసులోనే సినీ రంగంలో అడుగుపెట్టిన చిట్టిబాబు, తెలుగు, తమిళ చిత్రసీమల్లో అనేక మంది ప్రముఖులతో కలిసి పనిచేశారు. దర్శకుడిగా మారకముందు సుమారు 47 సినిమాలకు దర్శకత్వ విభాగంలో పనిచేసిన ఆయన, ‘సంతానం’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందారు. అనంతరం మరో 12 చిత్రాలకు దర్శకత్వం వహించారు.నటుడిగానూ ఆయన ప్రతిభ చాటుతూ దాదాపు 30 సినిమాల్లో నటించారు. రాఖీ సినిమా ద్వారా ఈతరం ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.భార్య ఉషా లత, ముగ్గురు సంతానం ఆయనకు ఉన్నారు. ఆయన మరణంతో తెలుగు చిత్రసీమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
