అమెరికా మీడియాలో తీవ్ర వ్యతిరేకత
వాషింగ్టన్: ఇరాన్తో యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుదుర్చుకున్న ఒప్పందంపై అమెరికా మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
యుద్ధానికి ముందు నిర్దేశించుకున్న లక్ష్యాలను వదిలిపెట్టారని, ఇరాన్ ప్రభావం మరింత పెరిగిందని, భారీ ఆర్థిక రాయితీలు ఇచ్చారని పలు మీడియా సంస్థలు వ్యాఖ్యానించాయి.
పారిస్ సమీపంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ట్రంప్ అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. మధ్యప్రాచ్యాన్ని కుదిపేసిన యుద్ధానికి ముగింపు పలకడమే ఈ ఒప్పందం లక్ష్యంగా ప్రకటించారు.
అయితే అమెరికాకు తిరిగి చేరుకున్న తర్వాత ట్రంప్కు ప్రతిపక్షం మాత్రమే కాకుండా యుద్ధానికి మద్దతు ఇచ్చిన వర్గాల నుంచీ విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
సాధారణంగా ట్రంప్కు అనుకూలంగా వ్యవహరించే ఫాక్స్ న్యూస్ కూడా ఈ ఒప్పందంపై విమర్శలను ప్రస్తావించింది.
ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలనే షరతు లేకుండానే భారీ ఆర్థిక ప్రయోజనాలు కల్పించారని విమర్శకులు పేర్కొన్నట్లు తెలిపింది.
ఇరాన్కు భారీ రాయితీలు ఇచ్చారన్న ఆరోపణలు
ఈ ఒప్పందం తాత్కాలిక ఏర్పాటేనని, ఇరాన్ అణు కార్యక్రమంపై దీర్ఘకాలిక ఒప్పందం కోసం సమగ్ర చర్చలకు సమయం కల్పించడమే దీని ఉద్దేశమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఒప్పందం ప్రకారం తుది అణు ఒప్పందం కుదిరిన తర్వాత ప్రాంతీయ దేశాల మద్దతుతో ఏర్పాటు చేసిన 300 బిలియన్ డాలర్ల పునర్నిర్మాణ నిధుల విడుదలకు అమెరికా సహకరించనుంది.
అమెరికా ప్రభుత్వం దీనిని దౌత్యపరమైన విజయంగా చూపిస్తున్నప్పటికీ, ఇరాన్కు ఇచ్చిన రాయితీలు పొందిన హామీల కంటే ఎక్కువగా ఉన్నాయని విమర్శకులు చెబుతున్నారని ఫాక్స్ న్యూస్ పేర్కొంది.
ఎంఎస్ నౌ టెలివిజన్ నెట్వర్క్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. యుద్ధానికి ముందు పెట్టుకున్న ప్రధాన లక్ష్యాలు ఏవీ సాధించకుండానే కాల్పుల విరమణ పొడిగింపుకు అమెరికా అంగీకరించిందని విమర్శించింది.
వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ ఒప్పందాన్ని ట్రంప్ రెండో పదవీకాలంలో అత్యంత కీలక విదేశాంగ నిర్ణయంగా అభివర్ణించింది. అయితే ఇరాన్ విషయంలో కఠిన వైఖరి కోరుకునే వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే అవకాశముందని పేర్కొంది.
ఒప్పందంపై సంతకాల ప్రక్రియ కూడా గందరగోళంగా మారినట్లు నివేదికలు వెల్లడించాయి. ట్రంప్ బుధవారం రాత్రి మరోసారి సంతకం చేయడంతో కొంతమంది అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారని సమాచారం.
న్యూయార్క్ టైమ్స్ తన విశ్లేషణలో ఈ ఒప్పందం లొంగుబాటు పత్రంలా కనిపించడం లేదని పేర్కొంది. యుద్ధం తర్వాత ఇరాన్ విజయోత్సాహంతో ఉండే పరిస్థితి కనిపిస్తోందని వ్యాఖ్యానించింది.
యుద్ధం ప్రారంభమైన సమయంలో ఇరాన్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం గుర్తు చేసింది.
కానీ తాజా పరిణామాలతో కొత్త నాయకత్వానికి మరింత బలం చేకూరినట్లు కనిపిస్తోందని విశ్లేషించింది.
అణ్వాయుధాల అభివృద్ధి విషయంలో కూడా ఇరాన్ తన వ్యూహాన్ని మరింత దూకుడుగా కొనసాగించే అవకాశం ఉందని న్యూయార్క్ టైమ్స్ అభిప్రాయపడింది.
ఇక ఎన్పీఆర్ యుద్ధం వల్ల జరిగిన ప్రాణనష్టాలపై దృష్టి సారించింది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైనిక బలగానికి ఎదురుగా తక్కువ వనరులు ఉన్నప్పటికీ వ్యూహాత్మకంగా వ్యవహరించిన ప్రత్యర్థితో ఈ యుద్ధం సాగిందని పేర్కొంది.



