దోహాలో ఉన్నతస్థాయి భేటీ జరుగుతుందన్న ట్రంప్
అమెరికాతో ఎలాంటి చర్చలు లేవని స్పష్టం చేసిన ఇరాన్
టెహ్రాన్: మధ్యప్రాచ్య యుద్ధానికి ముగింపు పలికే ఒప్పందంపై చర్చల నేపథ్యంలో ఖతార్ రాజధాని దోహాలో మంగళవారం ఇరాన్తో సమావేశం జరుగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే అమెరికాతో ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరగబోవడం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో స్పందిస్తూ, “ఇరాన్ సమావేశం కోరింది. అది రేపు దోహాలో జరుగుతుంది” అని పేర్కొన్నారు. అయితే ఈ సమావేశంలో ఎవరు పాల్గొంటారనే వివరాలు వెల్లడించలేదు.
వైట్ హౌస్ అధికార ప్రతినిధి కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ, అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ సలహాదారు, అల్లుడు జారెడ్ కుష్నర్ ఈ వారం దోహాకు వెళ్లి ఉన్నతస్థాయి సమావేశాల్లో పాల్గొంటారని తెలిపారు.
ఖండించిన ఇరాన్
ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయీ మాట్లాడుతూ.. తమ నిపుణుల బృందం ఈ వారం దోహాకు వెళ్తుందని ధృవీకరించారు. అయితే అమెరికా ప్రతినిధులతో ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరగబోవడం లేదని స్పష్టం చేశారు.
తుది ఒప్పందంపై చర్చలు ప్రారంభించే దశకు ఇంకా రాలేదని, రాబోయే రోజుల్లో అమెరికాతో ఏ స్థాయిలోనూ చర్చలు ఉండవని తెలిపారు.
హోర్ముజ్ జలసంధిపై చర్చలు
అమెరికా-ఇరాన్ అవగాహన ఒప్పందం కుదిరిన తర్వాత హోర్ముజ్ జలసంధి నిర్వహణపై ఇరాన్, ఒమాన్ తొలి సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశం ఒమాన్ రాజధాని మస్కట్లో జరిగింది.
ప్రపంచ చమురు, ద్రవీభవించిన సహజ వాయువు సరఫరాలో కీలకమైన హోర్ముజ్ జలసంధిపై నియంత్రణ అంశం ఇప్పటికీ ఇరు దేశాల మధ్య ప్రధాన వివాదంగా కొనసాగుతోంది.
కొనసాగుతున్న ఉద్రిక్తతలు
ఆదివారం అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్కు చెందిన పది సైనిక లక్ష్యాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. దీనికి ప్రతిగా కువైట్, బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలపై దాడులు జరిపినట్లు ఇరాన్ తెలిపింది.
హోర్ముజ్ జలసంధిలో తమ సూచించిన మార్గాన్ని పక్కనబెట్టి నౌకలు ప్రయాణిస్తే ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని ఇరాన్ హెచ్చరించింది. జలసంధిలో రాకపోకల నియంత్రణలో తామే కీలక పాత్ర పోషిస్తామని మరోసారి స్పష్టం చేసింది.
ఫ్రాన్స్కు హెచ్చరిక
హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు చర్యలను ఫ్రాన్స్, ఒమాన్ కలిసి చేపట్టనున్నట్లు ప్రకటించడంతో ఇరాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
అవగాహన ఒప్పందం ప్రకారం మైన్ల తొలగింపు బాధ్యత పూర్తిగా ఇరాన్కే ఉంటుందని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాద్ీ తెలిపారు.
పరిస్థితి అత్యంత సున్నితంగా ఉందని, ఫ్రాన్స్ మరింత రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు.
లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు
మరోవైపు, గత వారం శాంతి ఒప్పందానికి రూపకల్పన జరిగినప్పటికీ, లెబనాన్ దక్షిణ ప్రాంతంలో ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడులు నిర్వహించినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా తెలిపింది.
అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం హెజ్బొల్లా ఆయుధాలు వదలాల్సి ఉండగా, ఆ ఒప్పందాన్ని ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.



