ఉత్తరాంధ్ర జిల్లాల తలమానికమైన కింగ్ జార్జ్ ఆసుపత్రి (KGH)లో రోగుల పట్ల నిర్లక్ష్యం వహించినా, డబ్బులు ఆశించినా ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ హెచ్చరించారు. శనివారం ఉదయం ఆయన ఆసుపత్రిలోని వివిధ విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

అత్యవసర వైద్య విభాగం, బర్నింగ్ వార్డ్, ప్లాస్టిక్ సర్జరీ విభాగాలను కలెక్టర్ సందర్శించారు. రోగులతో నేరుగా మాట్లాడి అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాల గురించి ఆరా తీశారు.చికిత్స కోసం సిబ్బంది డబ్బులు అడుగుతున్నారని కొందరు రోగుల బంధువులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనిపై తక్షణమే పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కేజీహెచ్ సూపరింటెండెంట్ను ఆదేశించారు. KGHలో అన్ని వైద్య సేవలు ఉచితంగా అందుతాయని, ఎవరైనా డబ్బులు అడిగితే రూపాయి కూడా ఇవ్వవద్దని రోగులకు సూచించారు. ఆసుపత్రిలో ఉచిత వైద్యం గురించి ప్రజలకు తెలిసేలా ప్రతి విభాగం వద్ద స్పష్టమైన బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ ఐ.వాణి, ఆర్ఎంవో బంగారయ్య మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
