అమరావతిBNS ఏప్రిల్ 8: ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బుధవారం రాష్ట్ర సచివాలయంలో సమావేశమైంది. అమరావతి నిర్మాణ ప్రగతిని ప్రతినిధి బృందం ప్రశంసించింది. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాలు, ఐటీ-విద్యుత్ రంగ సంస్కరణల వల్ల ఈ నగరం భారీగా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తుందని ప్రపంచ బ్యాంకు బృందం అభిప్రాయపడింది. రాష్ట్రానికి అమరావతి గ్రోత్ ఇంజిన్ గా మారుతుందని వెల్లడించింది. మౌలిక సదుపాయాల అభివృద్ధితో వాణిజ్య కార్యాకలాపాలకు అమరావతి కేంద్రంగా మారుతుందని ఆశిస్తున్నట్టు బృంద ప్రతినిధులు ముఖ్యమంత్రితో చెప్పారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేపట్టడంతోపాటు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి దిశగా తాము పని చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రపంచ బ్యాంక్ బృందానికి సీఎం చంద్రబాబు వివరించారు. మూడు రీజియన్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు.
