తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పాదయాత్ర సెంట్రల్ పాయింట్గా మారబోతోంది. వచ్చే ఏడాది చివర నుంచి తాను నేరుగా ప్రజల్లోకి వస్తానని, సుమారు ఒకటిన్నర సంవత్సరాల పాటు (18 నెలలు) జనంలోనే ఉంటానని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలో జరిగిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు.
“పాదయాత్ర మొదలైతే చంద్రబాబుకు రోజూ సినిమాయే”
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం టర్మ్ పూర్తి కావస్తోందని, మిగిలిన సమయం చాలా తక్కువని జగన్ పేర్కొన్నారు. “ఇంకో సంవత్సరం దాటితే, అంటే వచ్చే ఏడాది ఇదే సమయానికి నా పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నేను రోడ్డు మీదకు వచ్చి 18 నెలల పాటు ప్రజలతోనే ఉంటాను. నా యాత్ర మొదలైన తర్వాత చంద్రబాబుకు ప్రతిరోజూ సినిమా చూపిస్తాం” అని జగన్ వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఈ యాత్రను ప్రధాన అస్త్రంగా మార్చుకోనున్నట్లు ఆయన తెలిపారు.
ప్రతి వారం నియోజకవర్గ సమీక్షలు
పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు జగన్ తన కార్యాచరణను ముమ్మరం చేశారు. ఇకపై ప్రతి వారం ఒక నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో నేరుగా సమావేశం అవుతానని ఆయన ప్రకటించారు. గ్రామ స్థాయి నుంచి కమిటీలను పటిష్టం చేయాలని, ప్రజల పక్షాన పోరాడాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
రాజధాని అంశంపై విమర్శలు
అమరావతి విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను, రైతులను మోసం చేస్తోందని జగన్ ధ్వజమెత్తారు. లక్ష ఎకరాల రాజధాని అంటూ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని, అక్కడ కనీస వసతులకే లక్షల కోట్లు ఖర్చవుతాయని విమర్శించారు. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయడం ద్వారా ఖర్చు లేకుండా అభివృద్ధి సాధ్యమవుతుందని తాము ప్లాన్-ఏ చెబితే రాజకీయం చేశారని, కనీసం మచిలీపట్నం వంటి ప్రాంతాల్లో అభివృద్ధి చేసే ప్లాన్-బీని కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
కేడర్లో పెరిగిన జోష్
వరుస ఎన్నికల ఫలితాల తర్వాత కొంత స్తబ్దుగా ఉన్న వైసీపీ శ్రేణుల్లో జగన్ తాజా ప్రకటన కొత్త ఉత్సాహాన్ని నింపింది. “వైఎస్సార్సీపీ 2.0” పేరుతో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా జగన్ అడుగులు వేస్తున్నారు. గతంలో 3,648 కిలోమీటర్ల పాదయాత్రతో అధికారాన్ని కైవసం చేసుకున్న జగన్, ఇప్పుడు మళ్లీ అదే ఫార్ములాను నమ్ముకోవడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
