మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 86వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలను కలిసి వారి సమస్యలను తెలుసుకొని వినతులు స్వీకరించారు.

ఈ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన వ్యక్తి తన తండ్రి వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సాయం అందించాలని కోరగా, సంబంధిత అంశాన్ని పరిశీలిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం ఆర్.చంద్రంపాలెంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని, అనకాపల్లి జిల్లా మాడుగులలో మసీదు నిర్మాణానికి సాయం చేయాలని వచ్చిన వినతులను కూడా ఆయన స్వీకరించారు.అలాగే ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలానికి చెందిన మహిళ తన వ్యవసాయ భూమిని ఆన్లైన్లో నమోదు చేయాలని కోరగా, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.అంతకుముందు హిందూపూర్ నుంచి అమరావతి వరకు 713 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేసిన బోయ మంజునాథ్ను మంత్రి లోకేష్ అభినందించారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు చేసిన యాత్రపై వివరాలు అడిగి తెలుసుకుని, తన అండ ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

