కుమారుడిని రక్షించేందుకు వెళ్లిన తండ్రి.. ప్రమాదవశాత్తు లోయలోకి
మూడు గంటల పాటు నచ్చజెప్పినా వినని యువకుడు
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
కుటుంబ విభేదాల కారణంగా కొండపై నుంచి దూకుతానని బెదిరించిన ఓ యువకుడిని కాపాడే ప్రయత్నంలో అతడి తల్లిదండ్రులు కూడా లోయలో పడి మృతి చెందారు.
ముగ్గురూ లోతైన క్వారీలో పడిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది.
కుటుంబ గొడవలతో కొండపైకి యువకుడు
దేవలాయ్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు కుటుంబంలో గొడవల కారణంగా శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఖవ్డా డోంగర్ పైభాగానికి చేరుకున్నాడు.
కొండ అంచున నిలబడి కిందకు దూకుతానని బెదిరించాడు. విషయం తెలుసుకున్న అతడి తల్లిదండ్రులు, స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనా స్థలానికి వచ్చారు.
యువకుడికి నచ్చజెప్పి కిందకు దిగి రావాలని చెప్పారు. దాదాపు మూడు గంటల పాటు అతడిని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నించారు.
సేఫ్టీ నెట్ ఏర్పాటు చేసినా వినని యువకుడు
అగ్నిమాపక సిబ్బంది ముందుజాగ్రత్తగా కింద సేఫ్టీ నెట్ను సిద్ధంగా ఉంచారు. అయినా యువకుడు వినలేదు.
ప్రమాదకరమైన కొండ అంచుపైనే తిరుగుతూ కిందకు దూకుతానని బెదిరించాడు.
మధ్యాహ్నం 1 గంట సమయంలో అతడు ఒక్కసారిగా క్వారీలోకి జారిపడ్డాడు. వెంటనే అతడిని పట్టుకుని పైకి లాగేందుకు తండ్రి ప్రయత్నించాడు.
ఈ క్రమంలో తండ్రి కూడా పట్టుతప్పి లోయలో పడిపోయాడు.
కొడుకు, భర్తను చూసి తల్లి కూడా..
భర్త, కొడుకు కళ్లముందే లోయలో పడిపోవడంతో తీవ్ర భయాందోళనకు గురైన తల్లి కూడా మరుక్షణమే క్వారీలోకి దూకిందని మాజీ తిస్గావ్ సర్పంచ్ సంజయ్ జాధవ్ తెలిపారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని, దిగ్భ్రాంతిని మిగిల్చింది.
పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడే ఉండి యువకుడిని అంచు నుంచి దూరంగా రావాలని పదేపదే నచ్చజెప్పినా వారి ప్రయత్నాలు ఫలించలేదు.
ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే..
‘‘మొదట్లో కింద నుంచి తన కొడుకును తండ్రి బతిమాలుతున్నాడు. చివరి 15-20 నిమిషాల్లో కొండపైకి ఎక్కాడు.
యువకుడు అంచుకు దగ్గరగా వెళ్తుండటంతో అక్కడి నుంచి దూరంగా వెళ్లాలని తండ్రి నచ్చజెప్పాడు.
మధ్యాహ్నం సుమారు 1 గంటకు తన కొడుకును పట్టుకోవడానికి ప్రయత్నించగా ఇద్దరూ బ్యాలెన్స్ కోల్పోయి కొండపై నుంచి కిందపడిపోయారు.
కొద్దిసేపటికే తీవ్ర భయాందోళనకు గురైన తల్లి కూడా కొండపై నుంచి కిందపడిపోయింది’’ అని ప్రత్యక్ష సాక్షి సంజయ్ జాధవ్ తెలిపారు.
పోలీసు అధికారులు కూడా అక్కడే ఉన్నారని, వారు కూడా యువకుడిని అంచు నుంచి దూరంగా వెళ్లాలని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారని చెప్పారు.
అయినా వారి ప్రయత్నాలు విఫలమయ్యాయని వివరించారు.



